
పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు
తిరుమలాయపాలెం: అర్హులైన పేదలందరికీ దశల వారీగా ఇందిరమ్మ గృహాలు మంజూరు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. తిరుమలాయపాలెం మండలంలోని రఘునాథపాలెం, గోల్తండా, రాజారం, దమ్మాయిగూడెం, కొక్కిరేణి గోపాలపురం తదితర గ్రామాల్లో సోమవారం పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన చేయడమే కాక పూర్తయిన పనులను ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో పొంగులేటి మాట్లాడుతూ నిరుపేదలకు తొలుత ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని.. ఆతర్వాత అర్హులందరికీ మంజూరు చేస్తామని తెలిపారు. మొదటి దఫా ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలోగా మరో విడత కేటాయిస్తామని పేర్కొన్నారు. కాగా, ఇచ్చిన మాట ప్రకారం రేషన్షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తుండగా, కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తున్నామని మంత్రి తెలిపారు.
నేటి నుంచి సదస్సులు
వానాకాలం సీజన్కు సంబంధించి త్వరలోనే రైతులకు రైతు భరోసా నిధులు విడుదలవుతాయని మంత్రి పొంగులేటి చెప్పారు. అలాగే, ధరణి స్థానంలో ప్రవేశపెట్టిన భూభారతి ద్వారా అన్ని రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భూసమస్యలపై దరఖాస్తుల స్వీకరణ, పరిష్కారమే లక్ష్యంగా మంగళవారం నుంచి ఈ సదస్సులు మొదలవుతాయని వెల్లడించారు. గత ప్రభుత్వం అప్పుల భారం మోపినా ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతూనే అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ కార్యమాల్లో ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ, నాయకులు మద్దినేని స్వర్ణకుమారి, రామసహాయం నరేష్రెడ్డి, బెల్లం శ్రీనివాస్, మంగీలాల్, కొప్పుల అశోక్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి