
పెద్దమ్మతల్లికి విశేష పూజలు
పాల్వంచరూరల్: పాల్వంచ మండలం కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ(పెద్దమ్మతల్లి) అమ్మవారికి ఆదివారం విశేష పూజలు చేశారు. జిల్లా నలుమూలలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఒడి బియ్యం, పసుపు, కుంకుమ, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పలువురు భక్తులు తమ చిన్నారులకు అన్నప్రాసన జరిపించారు. వేద పండితులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్ శర్మ, ఈఓ ఎన్.రజనీకుమారి పాల్గొన్నారు.
రాయితీపై ఫైబర్ గడలు
దమ్మపేట : పామాయిల్ గెలల కోతకు వినియోగించే ఫైబర్ గడలను ఉద్యాన శాఖ ద్వారా రాయితీపై అందజేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మండలంలోని గండుగులపల్లిలోని తన నివాసంలో పలువురు రైతులు కలిసి సమస్యలపై వినతిపత్రాలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎత్తయిన పామాయిల్ చెట్ల గెలలు కోసే క్రమంలో విద్యుత్ షాక్ తగలకుండా ఫైబర్ గడలను వినియోగించాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు కొయ్యల అచ్యుతరావు, కాసాని నాగప్రసాద్, వసంతరావు, అప్పారావు, రైతులు పాల్గొన్నారు.