
ఆస్తుల కన్నా.. పర్యావరణం మిన్న
సింగరేణి(కొత్తగూడెం): ప్రపంచంలో అన్నింటికీ హద్దులు ఉన్నా.. గాలి, వెలుతురు, ఆక్సిజన్కు లేవని, అందుకే ఆస్తుల కంటే పర్యావరణమే ముఖ్య మని గుర్తించాలని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ సూచించారు. కొత్తగూడెం ఏరియా పరిధిలోని జీకేఓసీ డంప్యార్డ్ వద్ద ఆదివారం వన మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన 121 మొక్కలు నాటారు. దీంతో తాను ఇప్పటివరకు 19,121 మొక్కలు నాటానని, వచ్చే జూలై చివరి నాటికి మరో 1,879 మొక్కలు నాటి.. 21వేల లక్ష్యాన్ని చేరాల్సి ఉందని వివరించారు. ఒక మొక్క ద్వారా రూ. కోటి విలువైన ఆక్సిజన్ ఉచితంగా పొందవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది సింగరేణి ఆధ్వర్యంలో 40 లక్షల మొక్కలు నాటనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ఎల్.వీ.సూర్యనారాయణ, కె.వెంకటేశ్వర్లు, ఏరియా జీఎం శాలేంరాజు, అటవీ, పర్యావరణ శాఖ సలహాదారు మోహన్ చంద్ర పరిగెన్, పర్యావరణ జీఎం సైదులు, జీకేఓసీ పీఓ రమేష్, సూర్యనారాయణతో పాటు ఎండీ రజాక్, గట్టయ్య తదితరులు పాల్గొన్నారు.
వన మహోత్సవంలో మొక్కలు నాటిన సీఎండీ