సాగుకు మరింత నీరు | - | Sakshi
Sakshi News home page

సాగుకు మరింత నీరు

Jun 2 2025 12:30 AM | Updated on Jun 2 2025 12:30 AM

సాగుక

సాగుకు మరింత నీరు

● బుగ్గవాగు చెక్‌డ్యాం నుంచి పైపులైన్ల ఏర్పాటుకు ప్రణాళిక ● రూ.82కోట్ల బడ్జెట్‌తో ప్రభుత్వానికి ప్రతిపాదన ● అమలైతే 5,500 ఎకరాలకు సజావుగా సాగునీరు

ఖమ్మంఅర్బన్‌: జిల్లాలోని కామేపల్లి, రఘునాథపాలెం మండలాల్లో సాగునీటి కష్టాలు తీర్చేలా కొత్త పథకం తెరపైకి వచ్చింది. కారేపల్లి – కామేపల్లి మండలాల సరిహద్దుల్లో బుగ్గవాగుపై ఏళ్ల క్రితమే చెక్‌డ్యాం నిర్మించగా.. గ్రావిటీ కాల్వల నిర్మాణానికి భూసేకరణ ఇబ్బందిగా మారడంతో ఫలితం దక్కలేదు. ఇటీవల రఘునాథపాలెం మండలంలోని వీ.వీ.పాలెం వద్ద సాగర్‌ ప్రధాన కాల్వపై నిర్మించిన మంచుకొండ ఎత్తిపోతల పథకం నుంచి పైపులైన్ల ద్వారా 33 చెరువులకు సాగునీరు మళ్లించగా విజయవంతమైంది. ఇదే తరహాలో చెక్‌డ్యాం నుంచి పైపులైన్లు వేసి చెరువులకు నీరు మళ్లించాలని ప్రతిపాదించిన జల వనరుల శాఖ అధికారులు రూ.82 కోట్ల నిధుల కోసం ప్రభుత్వానికి డీపీఆర్‌ సమర్పించినట్లు తెలిసింది.

పదేళ్ల క్రితమే నిర్మాణం

బుగ్గవాగుపై పదేళ్ల క్రితమే చెక్‌డ్యామ్‌ నిర్మించారు. ఆతర్వాత గ్రావిటీ కాల్వల ద్వారా చెరువులకు నీరు తరలించాలని భావించారు. ఇందుకోసం సుమారు రూ.40 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు సిద్ధం చేసినా... భూసేకరణలో విలువైన భూములు కోల్పోతున్నామని రైతులు వ్యతిరేకించారు. దీనికితోడు మరి కొన్ని సమస్యలతో పథకం ముందుకు సాగలేదు.

‘మంచుకొండ’ సక్సెస్‌

బుగ్గవాగు చెక్‌డ్యాం నుంచి నీరు తరలించేందుకు ఎక్కువ భూసేకరణ అవసరం లేకుండా ప్రత్యామ్నాయంపై అధికారులు ఆలోచన చేశారు. ఇటీవల రఘునాథపాలెం మండలం వీ.వీ.పాలెంలో సాగర్‌ ప్రధాన కాల్వపై నిర్మించిన మంచుకొండ ఎత్తిపోతల పథకం నుంచి పైపులైన్ల ద్వారా 33 చెరువులకు సాగునీరు విడుదల చేశారు. ఇది సత్ఫలితాలను ఇవ్వడంతో అధికారులు బుగ్గవాగు చెక్‌డ్యాంపై దృష్టి సారించారు. మంచుకొండ మాదిరిగానే పైపులైన్లు నిర్మిస్తే తక్కువ భూసేకరణ, వ్యయంతో పని పూర్తవుతుందనే నిర్ణయానికి వచ్చారు.

26 కి.మీ.. 200 క్యూసెక్కులు

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచనలతో సుమారు 26 కి.మీ. మేర పైపులైన్‌ నిర్మాణం, భూసేకరణ, ఇతర పనులకు రూ.82కోట్లు అవసరమని జల వనరుల శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించారు. ఇది అమలైతే కామేపల్లి మండలంలోని 21, రఘునాథపాలెం మండలంలోని 10 చెరువులకు కలిపి 31 చెరువులకు పైపులైన్‌ ద్వారా నీరు అందుతుంది. సుమారు 200 క్యూసెక్కుల నీటిని తరలించడం ద్వారా దాదాపు 5,500 ఎకరాలకు సాగునీరు అందుతుందని, సమీప ప్రాంతాల్లో భూగర్భజలాలు మెరుగుపడతాయని.. తాగునీటి సమస్యకు సైతం పరిష్కారం లభిస్తుందని చెబుతున్నారు. వర్షాకాలంలో వాగుల ద్వారా వచ్చే నీటిని చెక్‌డ్యామ్‌లో నిలిపి.. ఆపై చెరువులకు తరలిస్తే పంట సాగు చివరి దశలో ఇబ్బందులు ఎదురుకావని భావిస్తున్నారు. కాగా, మంచుకొండ లిఫ్ట్‌ ద్వారా రఘునాథపాలెం మండలంలోని పలు చెరువులకు సాగర్‌ జలాలు విడుదల చేయగా, మిగతా చెరువులకు బుగ్గవాగు చెక్‌డ్యాం నుంచి నీరు అందనుండడంతో మండలంలో సాగునీటి కష్టాలు తీరుతాయని చెబుతున్నారు.

సాగుకు మరింత నీరు1
1/1

సాగుకు మరింత నీరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement