
విత్తనోత్పత్తికి శ్రీకారం
● రైతులకు ‘ఫౌండేషన్ సీడ్’ పంపిణీ ● జిల్లాలోని 379 గ్రామాల్లో ముగ్గురేసి రైతుకు వరి, పెసర విత్తనాలు ● నేడు పంపిణీకి సిద్ధం చేసిన యంత్రాంగం
ఖమ్మంవ్యవసాయం: మెరుగైన విత్తనోత్పత్తే లక్ష్యంగా రైతులకు ఫౌండేషన్ సీడ్(పునాది విత్తనం) పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎంపిక చేసిన రైతులకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం వీటిని అందించనున్నారు. జిల్లాలోని 379 రెవెన్యూ గ్రామాల్లో ముగ్గురు చొప్పున రైతులకు వరి, పెసర విత్తనాలను పంపిణీ చేసేలా జిల్లా వ్యవసాయ శాఖ, వైరా కేవీకే ఆధ్వర్యాన ఏర్పాట్లు చేశారు. వరి డబ్ల్యూజీఎల్–44 సన్న రకం, పెసర ఎంజీజీ– 385 రకాలను అందిస్తారు. వరి విత్తనాలను ఒక్కో రెవెన్యూ గ్రామంలో ఇద్దరికి చొప్పున 758 మందికి, పెసలు ఒక్కొక్కరు చొప్పున 379 మంది రైతులకు అందించాలని నిర్ణయించారు.
నాణ్యమైన విత్తనాల కోసం..
రైతులు ఏటా విత్తనాలు కొనుగోలు చేయకుండా సొంతంగా విత్తనోత్పత్తి చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఆయా రైతులు సొంత అవసరాలకు వాడుకోవడమే కాక గ్రామాల్లో ఇతరులకు అమ్ముకోవడం ద్వారా ఆదాయం లభిస్తుందని భావనకు వచ్చినట్లు తెలిసింది. ఇందులో భాగంగా రైతుల ద్వారా విత్తనోత్పత్తి చేసేలా ప్రభుత్వం ఫౌండేషన్ సీడ్ పంపిణీకి శ్రీకారం చుడుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీల ద్వారా విత్తనాలు విక్రయించడం కంటే రైతులే విత్తనోత్పత్తి చేసేలా ప్రోత్సహించేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. తద్వారా నకిలీ విత్తనాల బారిన పడకుండా అడ్డుకట్ట వేసే అవకాశముంది. అలాగే, రైతులు సాగు చేసే పంటను అధికారులు, శాస్త్రవేత్తలు పరిశీలించి అవగాహన కల్పిస్తేఅందరికీ మేలు జరగనుంది. ఈ రకంగా మూడేళ్ల పాటు విత్తనోత్పత్తి చేయించేలా ఫౌండేషన్ విత్తనాలు పంపిణీ చేయనున్నారు.