షరా మామూలే | - | Sakshi
Sakshi News home page

షరా మామూలే

Jun 1 2025 12:12 AM | Updated on Jun 1 2025 12:12 AM

షరా మామూలే

షరా మామూలే

తప్పుల తడక..

సత్తుపల్లి: సత్తుపల్లిలోని పలు స్కానింగ్‌ సెంటర్లలో తప్పులతడకగా రిపోర్టులు ఇవ్వడం, రోగులతో నిర్లక్ష్యంగా వ్యవహరించడం.. పలుమార్లు ఆందోళనలు జరుగుతుండడం షరామామూలుగా మారింది. పట్టణంలోని ఆల్ఫా స్కానింగ్‌ సెంటర్‌కు మే 1వ తేదీన వచ్చిన మహిళను ఎదురుగా ఉన్న ఆస్పత్రికి రిఫర్‌ చేయటం.. అక్కడ ఆపరేషన్‌ వికటించి ఆమె మృతి చెందింది. ఈ ఘటన మరువక ముందే ఆరు నెలల గర్భిణి అనూషకు తొమ్మిది నెలలు నిండిన జ్యోతి స్కానింగ్‌ రిపోర్టు ఇవ్వడంతో చికిత్స వికటించింది.

కేసులు నమోదు అవుతున్నా..

గతేడాది ఆల్ఫాస్కానింగ్‌ సెంటర్‌లో కిడ్నీలో రాళ్లు ఉన్నట్టు తప్పుడు రిపోర్టు ఇవ్వడంతో నష్టపోయానని సత్తుపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఓ వ్యక్తి ఫిర్యాదు ఇచ్చాడు. నెల కిందట విద్యుత్‌శాఖ ఉద్యోగి బంధువు కడుపులో ఓవరిస్‌ సమస్య లేకపోయినా ఉందని నివేదిక ఇవ్వగా, ఖమ్మంలో స్కానింగ్‌ చేయిస్తే ఇబ్బంది ఏమీ లేదని తేలింది. దీనిపై బాధితుడు స్కానింగ్‌ సెంటర్‌ బాధ్యులను నిలదీస్తే తప్పు జరిగిందని అంగీకరించారు.

వైద్యురాలు ఏం చేస్తున్నట్టు..

ఆరు నెలల గర్భిణి రిపోర్టు స్థానంలో తొమ్మిది నెలల గర్భిణి నివేదిక ఇవ్వగా.. పేరు చూడకుండానే డాక్టర్‌ ఉడతనేని లలితకుమారి మందులు రాయడం గమనార్హం. ఆరు నెలల గర్భిణికి తొమ్మిది నెలల గర్భిణికి సంబంధించిన మందులు రాయడంతో ఆమె అస్వస్థతకు గురవడం చర్చనీయాంశమైంది. గతంలో ఇదే ఆస్పత్రిలో వైద్యం వికటించి ఓ బాలింత మృతి చెందగా సర్దుబాటు చేసుకున్న విషయం విదితమే.

పర్సంటేజీలతోనే స్కానింగ్‌

చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే స్కానింగ్‌కు పంపించటం కొందరికి అనవాయితీగా మారింది. ప్రతీ స్కానింగ్‌లోనూ వైద్యులకు, స్కానింగ్‌ సెంటర్‌ నడుమ పర్సంటేజీల వ్యవహారం ఉండడంతోనే ఇలా చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సత్తుపల్లిలోని కొందరు వైద్యులకు ఇది నిత్యకృత్యంగా మారిందని చెబుతున్నా సత్తుపల్లిలో రెండు స్కానింగ్‌ సెంటర్లు ఉన్నా ఒకే సెంటర్‌కు రిఫర్‌ చేస్తుండడం ఈ విమర్శలకు బలం చేకూరుస్తోంది.

రెన్యూవల్‌ కాకున్నా..

ఆల్ఫా స్కానింగ్‌ సెంటర్‌కు 2023 వరకు మాత్రమే అనుమతి ఉండగా.. రెన్యూవల్‌కు దరఖాస్తు చేసుకున్నటికీ అనుమతి రాలేదని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ టి.సీతారాం శనివారం చేపట్టిన తనిఖీల్లో తేలింది. అంతేకాక ఏ పరీక్షకు ఎంత రుసుమో తెలిపే బోర్డు కూడా ఏర్పాటుచేయకుండా ఇష్టారీతిన వసూలు చేస్తున్నారని పలువురు ఫిర్యాదు చేశారు. స్కానింగ్‌ సెంటర్‌లో రిపోర్టులు తారుమారైన ఘటనపై డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సీతారాం, లంకాసాగర్‌ పీహెచ్‌సీ వైద్యులు చింతా కిరణ్‌కుమార్‌ తనిఖీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రిపోర్టులు మారిన తర్వాత వైద్యం చేయడంపై డాక్టర్‌ లలితకుమారిని కూడా ప్రశ్నించామని తెలిపారు. పేర్లు చూడకుండా వైద్యం చేసిన నేపథ్యాన వివరణ తీసుకున్నామని చెప్పారు. అలాగే, స్కానింగ్‌ సెంటర్‌లో సక్రమంగా వ్యవహరించడమే కాక పరీక్షల ధరలతో బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.

స్కానింగ్‌ సెంటర్లపై ఫిర్యాదులొస్తున్నా చర్యలు శూన్యం

వైద్యులతో పర్సంటేజీ ఒప్పందాలపై విమర్శలు

నిర్వాహకుల ఇష్టారాజ్యంతో

ప్రజల ఇక్కట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement