
నకిలీ పత్తి విత్తనాలు
మార్కెట్లోకి
● ఏపీలో తయారీ.. జిల్లాకు తీసుకొచ్చి విక్రయం ● ఏన్కూరు, మధిరలో భారీగా నకిలీ, నిషేధిత విత్తనాలు స్వాధీనం ● వివరాలు వెల్లడించిన సీపీ సునీల్దత్
ఏన్కూరు: కుటీర పరిశ్రమ మాదిరి ఇళ్లలోనే నకిలీ పత్తి విత్తన తయారుచేస్తూ విక్రయిస్తున్న పలువురిని జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మూడు ఘటనల్లో రూ.లక్షల విలువైన పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకోగా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు వివరాలను ఏన్కూరు పోలీసుస్టేషన్లో శుక్రవారం పోలీసు కమిషనర్ సునీల్దత్ వెల్లడించారు. ఏన్కూరుకు చెందిన గాజుల నరసింహారావు అనుమతి లేని పత్తి విత్తనాలు అమ్ముతున్నాడనే సమాచారంతో ఈనెల 28న తనిఖీలు చేపట్టారు. ఆయనను విచారించగా ఏపీలోని మైలవరం మండలం చంద్రుగూడెంకు చెందిన శాలివాహన ఇంటి వద్ద పత్తి విత్తనాలు తయారు చేస్తున్నట్లు తేలింది. సదరు వ్యక్తి కర్ణాటక నుంచి విత్తనాలు తీసుకొచ్చి రైబోజోల్ మిశ్రమాన్ని కలిపి నరసింహారావుకు పంపుతున్నాడని, ఆపై ఏజెంట్లకు లాభాల ఆశ చూపి కలుపు, తెగుళ్లను తట్టుకుంటాయని నమ్మబలుకుతూ ప్యాకెట్ రూ.1,200 చొప్పున అమ్ముతున్నట్లు గుర్తించారు. శాలివాహన ఇంటి వద్ద క్వింటా రైబోజోల్ మిశ్రమం కలిపిన ప్యాక్ చేయని పత్తి విత్తనాలు, 450 గ్రాముల బరువు కలిగిన అరుణోదయ లేబుల్తో ఉన్న 272 ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.
ఇవి కూడా ఏపీ నుంచే...
ఏన్కూరు మండలం రేపల్లెవాడలోని వెనిగండ్ల శ్రీఽహరిరావు వ్యవసాయ భూమిలో 210 ప్యాకెట్ల నకిలీ పత్తి విత్తనాలు లభించాయి. ఆపై శ్రీఽహరిరావు అనుచరుడు ఇమ్మనేని కిషోర్ ఇంట్లో తనిఖీ చేస్తే 120 కేజీల పత్తి విత్తనాలను గుర్తించారు. శ్రీహరిరావు ఏపీలోని తన బంధువు లక్ష్మీనారాయణ ద్వారా కేజీ రూ.800 చొప్పున నకిలీ విత్తనాలు తీసుకొచ్చి రూ.2,600 చొప్పున అమ్ముతుండడంతో శ్రీహరిరావు, కిషోర్తో పాటు ఏపీకి చెందిన అన్నెం లక్ష్మీనారాయణ, సిబ్బంది గుగులోత్ గోపీ, వరదబోయిన రమేష్, తంబళ్ల నవీన్, దొంతబోయిన రమేష్ను అరెస్టు చేసి 330 కేజీల నకిలీ పత్తి విత్తనాలు, ప్యాకింగ్, వేయింగ్ మిషన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఏన్కూరుకు చెందిన పోలేటి కోటేశ్వరరావు ఇంట్లో తనిఖీ చేపట్టగా 20 నకిలీ పత్తి విత్తన ప్యాకెట్లు లభించాయి. ఆయన ఏపీలోని తెనాలి నుంచి అనుమతి లేకుండా విత్తనాలు తీసుకొచ్చి అమ్ముతున్నట్లు గుర్తించారు. ఈ మేరకు కోటేశ్వరరావుతో పాటు ఆయనకు విత్తనాలు సరఫరా చేస్తున్న ఏపీలోని బాపట్ల జిల్లా ఇంకొల్లుకు చెందిన వెనిగండ్ల రవిని అరెస్టు చేసినట్లు సీపీ వెల్లడించారు. ఈ సమావేశంలో కల్లూరు ఏసీపీ రఘు, కల్లూరు రూరల్ సీఐ ముత్తులింగం, ఎస్సైలు షేక్ రఫీ, హరిత పాల్గొన్నారు.
మధిర మున్సిపాలిటీ పరిధిలో...
మధిర: మున్సిపాలిటీ పరిధి మడుపల్లిలో ప్రభుత్వం నిషేధించిన బీజే–3 పత్తి విత్తనాలు ప్యాకెట్లను శుక్రవారం టాస్క్ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన పారా రామస్వామి ఓ ఫెర్టిలైజర్స్ కంపెనీలో పని చేస్తుండగా ఆయన ఇంట్లో నిషేధిత పత్తి విత్తనాలు, పురుగు మందులు ఉన్నాయనే సమాచారంతో మధిర టౌన్ సీఐ రమేష్, వ్యవసాయ అధికారి సాయిదీక్షిత్, ఎస్ఐ లక్ష్మీభార్గవి ఆధ్వర్యాన తనిఖీలు చేపట్టారు. ఈమేరకు బీజే–3 అరుణోదయ పత్తి విత్తనాల ప్యాకెట్లు మూడు, అనుమతి లేకుండా విక్రయిస్తున్న రూ.65 వేల విలువైన పురుగు మందులు లభ్యమయ్యాయి. ఆయన నిదానపురంలో చెందిన బాధ పాపిరెడ్డి వద్ద విత్తనాలు కొనుగోలు చేసినట్లు చెప్పగా విచారణలో ఏపీలోని మైలవరం మండలం గంగినేనికి చెందిన నరేష్ వద్ద తీసుకొచ్చినట్లు వెల్లడించాడు. ఈమేరకు బాధ్యులను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.