
మత్స్య ఆధారిత ఉత్పత్తులతో అభివృద్ధి
కూసుమంచి: చేపల పెంపకం, అమ్మకానికే పరిమితం కాకుండా మత్స్య ఆధారిత ఉత్పత్తుల తయారీతో ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని నేషనల్ ఆగ్రో ఫౌండేషన్(చైన్నె) జాయింట్ డైరెక్టర్ పి.ప్రకాష్ తెలిపారు. పాలేరులోని మత్స్య పరిశోధనా కేంద్రంలో ఆరు జిల్లాల మహిళా మత్స్యకారులకు చేపలు, రొయ్యల ఆహార ఉత్పత్తుల తయారీపై ఇస్తున్న శిక్షణ శుక్రవారం రెండో రోజుకు చేరింది. ఈ సందర్భంగా ప్రకాశ్ మాట్లాడుదతూ చైనా, అమెరికా తదితర దేశాలతో పోలిస్తే మన దేశంలో చేపలతో తయారయ్యే విలువ ఆధారిత ఉత్పత్తులు తక్కువగా ఉన్నాయన్నారు. భవిష్యత్లో వీటికి డిమాండ్ పెరగనున్నందున మహిళా మత్స్యకారులు శిక్షణ ద్వారా నైపుణ్యాలు పెంపొంందించుకోవాలని సూచించారు. గ్రూప్లుగా ఏర్పడి చేపలు, రొయ్యలతో పచ్చళ్లు, ఇతర ఉత్పత్తులు చేస్తే ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతి చేయొచ్చని తెలిపారు. పాలేరు మత్స్య పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్యాంప్రసాద్ ఆధ్వర్యాన జరిగిన కార్యక్రమంలో నేషనల్ ఆగ్రో ఫౌండేషన్ తెలంగాణ, ఏపీ, తమిళనాడు రాష్ట్రాల కోఆర్డినేటర్ సునీల్కుమార్, జనగామ జిల్లా మత్స్యశాఖ అధికారి పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు.