
విత్తన దుకాణాల్లో టాస్క్ఫోర్స్ తనిఖీలు
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం గాంధీచౌక్లోని పలు విత్తన దుకాణాల్లో గురువారం టాస్క్ఫోర్స్ బృంధం తనిఖీలు చేసింది. వానాకాలం సాగు ప్రారంభమవుతున్న సందర్భంగా రైతులు విత్తనాల విక్రయానికి ముందుకొస్తున్నారు. ఈమేరకు నకిలీలు మార్కెట్లోకి రాకుండా వ్యవసాయ, పోలీసు శాఖలతో కూడిన టాస్క్ఫోర్సు బృందాలు రంగంలోకి దిగాయి. ఖమ్మం గాంధీచౌక్ కేంద్రంగా పెద్ద సంఖ్యలో విత్తన దుకాణాలు ఉండగా, ఖమ్మంతో పాటు మహబూబాబాద్, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, ఏపీలోని కృష్ణ, గుంటూరు జిల్లాల రైతులు వస్తుంటారు. దీంతో ఏడీఏ కొంగర వెంకటేశ్వరరావు, ఖమ్మం అర్బన్ ఏఓ బలుసు కిషోర్బాబు, ఖమ్మం త్రీటౌన్ సీఐ జె.మోహన్బాబుతో కూడిన బృందం గురువారం పలు షాపుల్లో తనిఖీ చేసింది. పత్తి విత్తన ప్యాకెట్ల లభ్యత, లాట్ నంబర్లు, తయారీ, గడువు తేదీలను పరిశీలించారు. అలాగే, అనుమతి లేని బీటీ–3 విత్తన విక్రయాలు జరుగుతున్నాయా అని ఆరా తీశారు. ఈ సందర్భంగా రైతులకు విధిగా బిల్లులు ఇవ్వాలని, నిర్దేశించిన విధంగా రికార్డులను నిర్వహించాలని డీలరలకు సూచించారు.