
పసిడి పండుగ వచ్చేసింది...
● నేడు అక్షయ తృతీయ ● దడ పుట్టిస్తున్న బంగారం ధర
ఖమ్మంగాంధీచౌక్: అక్షయ తృతీయ రోజున వీసమెత్తు బంగారమైనా కొంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని అంతా నమ్ముతారు. ఈ నమ్మకం ఆధారంగానే ఏటా ఈరోజు బంగారం, ఆభరణాల అమ్మకాలు జోరుగా సాగుతాయి. ఈమేరకు బుధవారం అక్షయ తృతీయ సందర్భంగా తరుగు, ఇతర చార్జీలపై ఆభరణాల షోరూంల యజమానులు ఆఫర్లు ప్రకటించారు. కానీ బంగారం ధర గరిష్టస్థాయి చేరడంతో పసిడి ప్రియులు ఆలోచనలో ఉండగా.. కొనుగోళ్లు ఎలా ఉంటాయోనని యజమానులు ఎదురుచూస్తున్నారు.
కొత్త డిజైన్లు, ఆఫర్లు
అక్షయ తృతీయ సందర్భంగా జ్యూఝెలరీ దుకాణాలు, కార్పొరేట్ షోరూంల్లో భిన్నమైన డిజైన్ల ఆభరణాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. కలకత్తా, రాజ్కోట్, ముంబయి, హైదరాబాద్, చైన్నె, గుజరాత్, కోయంబత్తూర్, బెంగళూరు తదితర ప్రాంతాల కొత్త మోడళ్లను తెప్పించగా, పలు ఆఫర్లు కూడా ప్రకటించారు. తులం బంగారం కొనుగోలుపై ఉచితంగా గోల్డ్ కాయిన్, మేకింగ్ చార్జీలు ఉండవని.. క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోలుకు రాయితీ ఇస్తామని చెబుతున్నారు.
పెరిగిన ధరలు
బంగారం ధరలు నానాటికీ పెరుగుతున్నాయి. ఖమ్మం మార్కెట్లో ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 97,970గా ఉంది. గత ఏడాది అక్షయ తృతీయ ముందు రోజు రూ.79,095 పలికింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ.89,800 ఉండగా, గత ఏడాది రూ.72,503గా ఉంది. ఏడాది కాలంలో బంగారం ధర రూ.17 వేలు పెరగడంతో ఈసారి కొనుగోళ్లు ఎలా ఉంటాయోననే సందిగ్ధత నెలకొంది.