రోడ్డుపై చెత్త వేసిన స్కూటరిస్టుకు గుణపాఠం
చిక్కబళ్లాపురం: రోడ్లపై ఇష్టానుసారంగా చెత్త వేసిన యువకుడిపై నగరసభ సిబ్బంది గట్టి గుణపాఠం చెప్పారు. ఈఘటన చిక్కబళ్లాపురంలో జరిగింది. శుక్రవారం ఓ యువకుడు స్కూటర్లో చెత్త తీసుకొని వచ్చి కందవార రోడ్డులో వేశాడు. నగరసభ సిబ్బంది గమనించి ఆ యువకుడిని మందలించారు. రోడ్డుపై చెత్త వేసినందుకు జరిమానా చెల్లించాలని సూచించారు. మీరు ఏం చేస్తారో చేసుకోండి..జరిమానా చెల్లించేది లేదని ఆ యువకుడు పేర్కొనడంతో నగరసభ సిబ్బంది అతని స్కూటర్ను నగరసభ కార్యాలయానికి తీసుకెళ్లారు.
కంతులు చెల్లించలేదని
ఇల్లు జప్తు
మైసూరు: కొంతకాలంగా చప్పుడు లేకుండా ఉన్న సూక్ష్మరుణ సంస్థలు మళ్లీ పంజా విసురుతున్నాయి. బాకీ చెల్లించలేదని ఓ వ్యక్తికి చెందిన ఇంటిని మైక్రోఫైనాన్స్ అధికారులు కోర్టు ఆదేశాలతో వచ్చి జప్తు చేశారు. మైసూరు జిల్లా నంజనగూడు తాలూకా కందెగాల గ్రామంలో చిన్న స్వామి అనే వ్యక్తి ఇంటి నిర్మాణం కోసం మైక్రోఫైనాన్స్లో రూ.2.70 లక్షలు రుణం తీసుకున్నాడు. ఇప్పటికే 19 వాయిదాల్లో రూ.1.89లక్షలు చెల్లించాడు. ఆర్థిక ఇబ్బందులతో మిగతా కంతులు చెల్లించడంలో జాప్యం జరిగింది. తనకు సమయం ఇస్తే కంతులు చెల్లిస్తానని చిన్నస్వామి తహసీల్దార్, కలెక్టర్కు లేఖ రాశారు. అయితే ఫైనాన్స్ సంస్థలు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో వచ్చి శుక్రవారం చిన్నస్వామి ఇంటిని జప్తు చేశారు.
సంచార జాతులకు
రిజర్వేషన్పై కట్టుబడి ఉన్నాం
బనశంకరి: సంచార(అలెమారి) సముదాయాలకు సామాజిక న్యాయం కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ దిశలో 1 శాతం రిజర్వేషన్ ఏవిధంగా అందించాలి అనేదానిపై పరిశీలించి చర్యలు తీసుకుంటామని సీఎం సిద్దరామయ్య తెలిపారు. రిజర్వేషన్లకు సంబంధించి అలెమారి ఒక్కూట పదాధికారుల కమిటీ శుక్రవారం ముఖ్యమంత్రి సిద్దరామయ్యను విధానసౌధలో కలిసి మనవి చేశారు. సముదాయ డిమాండ్లపై స్పందించిన సిద్దరామయ్య ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కులాల కోసం ఎస్సీపీ, టీఎస్పీ కార్యక్రమాలను అమలు చేసింది తమ ప్రభుత్వమేనన్నారు. ప్రతి ఒక్కరికీ న్యాయం అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. రిజర్వేషన్లు కల్పించడానికి ప్రభుత్వం ప్రామాణిక ప్రయత్నం చేస్తుందన్నారు. ప్రస్తుతం తలెత్తిన గందరగోళాన్ని ప్రాధాన్యత మేరకు పరిష్కరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నాగమోహన్దాస్ సిఫార్సుల ప్రకారం సంచార(అలెమారి) సముదాయానికి సామాజిక న్యాయం కల్పించే దృష్టితో ఒక శాతం రిజర్వేషన్ కల్పించడానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు.
తాను మరణించి నలుగురికి పునర్జన్మ
బనశంకరి: తీవ్ర ఒత్తిడితో మెదడులో రక్తస్రావం ఏర్పడి బ్రెయిన్డెడ్ కావడంతో 33 ఏళ్ల యువకుడి అవయవాలను నమ్మ మెట్రోలో తరలించిన డాక్టర్లు నలుగురు రోగులకు విజయవంతంగా శస్త్రచికిత్స చేసి పునరుజ్జీవం కల్పించారు. యశవంతపుర స్పర్శ్ ఆసుపత్రిలో దాత నుంచి తీసుకున్న అవయవాల్లో శ్వాసకోశం గురగుంటెపాళ్య మెట్రోస్టేషన్ నుంచి ఆర్వీ రోడ్డు స్టేషన్కు అక్కడ నుంచి యెల్లోలైన్ మార్గంగా బొమ్మసంద్ర మెట్రోస్టేషన్కు 61 నిమిషాల్లో 33 కిలోమీటర్లు నారాయణ హెల్త్ ఆసుపత్రికి తరలించారు. బెంగళూరు నగరంలోని మత్తికెరె నివాసి ఇంట్లో స్నానం చేసి బయటికి రాగానే తల తిరిగి స్పృహ కోల్పోయి కింద పడిపోయాడు. తక్షణం కుటుంబ సభ్యులు నిమ్హాన్స్ ఆసుపత్రికి తరలించిన తరువాత స్పర్శ్ ఆసుపత్రిలో చేర్చారు. యువకుడు బ్రెయిన్డెడ్ అయినట్లు డాక్టర్లు తెలపడంతో కుటుంబ సభ్యులు అవయవ దానానికి సమ్మతించారు. అనంతరం మెట్రోలో అవయవాలను తరలించారు. యశవంతపుర స్పర్శ్ ఆసుపత్రికి ఒక కిడ్నీ, విక్టోరియా ఆవరణలోని నరాలు, యూరాలజీ సంస్తకు మరో కిడ్నీ, మింటో కంటి ఆసుపత్రికి రెండు కార్నియాలను తరలించి శస్త్రచికిత్స ద్వారా రోగులకు అమర్చారు.
రోడ్డుపై చెత్త వేసిన స్కూటరిస్టుకు గుణపాఠం


