 
															టిప్పర్ ఢీ.. కారు దగ్ధం
● వ్యక్తి సజీవ దహనం
మండ్య: ఇన్నోవా కారును టిప్పర్ లారీ ఎదురుగా వచ్చి ఢీకొట్టిన ప్రమాదంలో మంటలు రేగి కారు కాలిపోయింది, అందులోని వ్యక్తి సజీవ దహనమయ్యాడు. మండ్య జిల్లాలోని శ్రీరంగపట్టణం తాలూకాలోని పి.హొసహళ్ళి వద్ద బుధవారం అర్ధరాత్రి ఈ ఘోరం జరిగింది. హుణసూరుకు చెందిన చంద్రశేఖర్ (30) అనే వ్యక్తి.. పనిమీద బయటకు వెళ్లి కేఆర్ఎస్ మార్గంలో తిరిగి హుణసూరుకు వెళ్తున్నాడు. ఘటనాస్థలిలో టిప్పర్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు బాగం నుజ్జు నుజ్జు కావడంతో పాటు మంటలు అంటుకుంది. డీజిల్ ట్యాంకు పేలి క్షణాల్లో అగ్నికీలలు చుట్టుముట్టాయి. కారులో చిక్కుకున్న చంద్రశేఖర్ బయటకు రాలేకపోయాడు. డ్రైవర్ టిప్పర్ను అక్కడే వదిలేసి పారిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. పోలీసులు కేసు నమోదు చేశారు.
పుర్రె గ్యాంగ్ యూటర్న్
● ధర్మస్థలపై తమ ఫిర్యాదును
కొట్టివేయాలని హైకోర్టుకు
శివాజీనగర: ధర్మస్థల చుట్టుపక్కల వందలాది శవాలను పూడ్చిపెట్టారనే కేసులో చేసిన ఫిర్యాదును రద్దు చేయాలని హైకోర్టులో పుర్రె గ్యాంగ్ సభ్యులు పిటిషన్ దాఖలు చేశారు. ధర్మస్థలలో వందలాది యువతులు, మహిళల మీద అఘాయిత్యాలు చేసి హత్యలు చేసి పాతిపెట్టారని చిన్నయ్య అలియాస్ చెన్నయ్య గతంలో జిల్లా ఎస్పీకి, జడ్జికి ఫిర్యాదు చేయడం, రాష్ట్ర ప్రభుత్వం సిట్తో విచారణ జరిపించడం తెలిసిందే. ఇందులో చిన్నయ్య, మరికొందరి ఆరోపణలు అవాస్తవాలని, సంచలనాల కోసం ఆరోపణలు చేశారని సిట్ తేల్చింది. ఇప్పుడు చిన్నయ్య జైలులో ఉన్నాడు. కేసు తమ మెడకే చుట్టుకోవడంతో అసలు ఫిర్యాదునే కొట్టివేయాలని కోర్టుకెక్కినట్లు భావిస్తున్నారు. మహేశ్ శెట్టి తిమరోడి, జయంత్, గిరీశ్ మట్టణ్ణవర్, విఠల్గౌడ హైకోర్టులో ఈ పిటిషన్ను దాఖలు చేశారు. ధర్మస్థళ క్షేత్రం మీద బురద చల్లిన వీరందరూ ఇప్పుడు యూ టర్న్ తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
ఉమాశ్రీకి రాజ్కుమార్ అవార్డు
సాక్షి, బెంగళూరు: 2019 ఏడాదికి గాను దివంగత డాక్టర్ రాజ్కుమార్ అవార్డు శాండల్వుడ్ సీనియర్ నటి ఉమాశ్రీని వరించింది. గురువారం రాజ్కుమార్ అవార్డు, పుట్టణ్ణ కణగాల్ అవార్డు, డాక్టర్ విష్ణువర్ధన్ అవార్డు, చలనచిత్ర సాహిత్య వార్షిక అవార్డుతో పాటు అత్యుత్తమ షార్ట్ఫిల్మ్ అవార్డుకు విజేతలను కన్నడ సంస్కృతి, వార్తా ఇలాఖ ప్రకటించింది. ఉమాశ్రీకి అవార్డు కింద రూ. 5 లక్షల నగదు, 50 గ్రాముల బంగారు పతకాన్ని అందిస్తారు.
నంజుండేగౌడకు పుట్టణ్ణ ప్రశస్తి
● పుట్టణ్ణ కణ్ణగాల్ అవార్డుకు దర్శకుడు ఎన్ఆర్ నంజుండేగౌడను ఎంపిక చేశారు. ఈ అవార్డు కింద రూ. 5 లక్షల నగదు, 50 గ్రాముల బంగారు పతకం అందించనున్నారు.
● డాక్టర్ విష్ణు వర్ధన్ అవార్డుకు నిర్మాత, దర్శకుడు రిచర్డ్ క్యాస్టలినో ఎంపిక అయ్యారు. ఈ అవార్డు కింద రూ. 5 లక్షల నగదు, 50 గ్రాముల బంగారు పతకం అందించనున్నారు. ఇంకా పలు విభాగాల్లో అవార్డులను ప్రకటించారు.
చెట్టుకు వ్యాన్ ఢీ..
ముగ్గురు మృతి
● శివమొగ్గ వద్ద ప్రమాదం
శివమొగ్గ: శివమొగ్గ, శికారిపుర తాలూకాలో జరిగిన రెండు ప్రమాదాల్లో నలుగురు చనిపోగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. శివమొగ్గ నగరానికి దగ్గరిలో గొంది చట్నహళ్ళి వద్ద గురువారం తెల్లవారుజామున గూడ్స్ వ్యాన్ చెట్టును ఢీకొట్టింది, అందులో ప్రయాణిస్తున్న అసాదుల్లా (50), సాదిక్ (30), ఫిరోజ్ (22) గాయాలతో మరణించారు. అసాదుల్లా దావణగెరెకు, మిగతావారు ఉత్తరప్రదేశ్కు చెందినవారు.
లారీ– బైక్ ఢీ..
శికారిపుర తాలూకాలోని సుణ్నదకొప్ప గ్రామం వద్ద బైకును లారీ ఢీకొట్టింది. బైక్లో వెళ్తున్న పునీత్ (22) దుర్మరణం చెందగా, రాజీవ్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. మెగ్గాన్ ఆస్పత్రికి తరలించారు.
 
							టిప్పర్ ఢీ.. కారు దగ్ధం

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
