
యువత రక్తదానం చేయాలి
రాయచూరు రూరల్ : ఆపత్కాలం, అత్యవసర సమయంలో రక్తదానానికి యువత ముందుకు రావాలని నగరసభ ఇంచార్జి అధ్యక్షుడు సాజిద్ సమీర్ సూచించారు. నగరంలోని లా కళాశాలలో ిసిటీ ఎలెవన్ క్లబ్, రెడ్ క్రాస్, వీర్ సావర్కర్ ఆధ్వర్యంలో మాజీ క్రికెట్ దిగ్గజం విజయ్ రెడ్డి స్మరణార్థం జరిగిన కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. రక్తదానం చేయడం వల్ల శరీరంలో కొత్త రక్తం పుడుతుందన్నారు. రక్తదానంపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. మాజీ ఎమ్మెల్సీ శంకరప్ప, శరణ రెడ్డి పాటిల్, మృత్యుంజయ, విజయ్ కుమార్, భరత్ రెడ్డి, వెంకటరెడ్డి, పద్మ, అరుణ, రవిరాజ్, వసుంధర పాటిల్లున్నారు.
హత్య ఆరోపణలతో
వ్యక్తిపై దాడి
రాయచూరు రూరల్: ఒకరిని హత్య చేశారనే ఆరోపణలపై దాడి చేసి గాయాలు పాల్జేసిన ఘటన జిల్లాలోని సింధనూరు తాలూకాలో చోటు చేసుకుంది. హత్యకు గురైన కుటుంబీకులు దాడికి పాల్పడ్డారని డీఎస్పీ తళవార్ తెలిపారు. సింధనూరు తాలూకా బంగాలీ క్యాంప్ నివాసి దీపాంకర్పై మహారాష్ట్రకు చెందిన వ్యక్తులు దాడి చేసి గాయపరిచారన్నారు. బంగాలీ క్యాంప్ నివాసి అంగోర్ను దీపాంకర్ మహారాష్ట్రకు పంపాడని తెలిపారు. అంగోర్ మరణించడంతో దీపాంకర్ హత్య చేయించాడని భావించి ఆదివారం రాత్రి దీపాంకర్పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని ఆయన తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. గాయపడ్డ దీపాంకర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.
సమాజ సేవకులకు సన్మానం
రాయచూరు రూరల్: విజ్ఞాన రంగంలో దేశానికి వన్నె తెచ్చిన వ్యక్తి అబ్దుల్ కలాం అని మటమారి జ్ఞానానంద స్వామీజీ పేర్కొన్నారు. పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందరింలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సంస్థ ఆధ్వర్యంలో కలాం 10వ పుణ్యారాధన సందర్భంగా సమాజంలో వివిధ రంగాల్లో సేవలు అందించిన సేవకులకు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డులను అందించి ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ కలాం ఆదర్శాలను, ఆశయాలను నెరవేర్చేందుకు ప్రయత్నించాలన్నారు. సంస్థ అధ్యక్షుడు విశ్వనాథరెడ్డి, బ్రహ్మకుమారి వర్సిటీ సంచాలకురాలు శారద, రమాకాంత్, ఉమేష్ కాంబ్లే, రవికుమార్, రాజశేఖర్, మహంతేష్ బిరాదార్లున్నారు.
అర్చకులను తొలగించాలి
రాయచూరు రూరల్: రాయచూరు తాలూకా గాణదాళ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో అన్య అర్చకులను తొలగించాలని టీయూసీఐ సంచాలకుడు అమరేష్ డిమాండ్ చేశారు. సోమవారం అంబేడ్కర్ సర్కిల్లో ఆందోళన చేపట్టి మాట్లాడారు. మూల అర్చకులను కాకుండా ఆంజనేయ స్వామి, ఎరుకలమ్మ ఆలయంలో దేవుడి సొమ్మును స్వాహా చేస్తున్న లక్ష్మణస్వామిని తొలగించాలన్నారు. ఆలయ ప్రాంగణంలో వేసుకున్న అంగళ్లు, హోటళ్ల యజమానుల నుంచి మామూళ్లు వసూలు చేయడాన్ని ఖండించారు. ఆందోళనలో నరసింహ, నల్లన్న, భీమణ్ణ, శివరాజ్, రవి, నాగరాజ్, యల్లప్ప, అయ్యప్ప, మల్లే్ష్, ధూళయ్యలున్నారు.
ఎరువుల దుకాణంలో
అగ్నిప్రమాదం
కోలారు: బంగారుపేట తాలూకా హుణసనహళ్లి గ్రామ రైల్వే బ్రిడ్జి సమీపంలో ఉన్న ఎరువుల దుకాణంలో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుని దుకాణంలో నిల్వ చేసిన ఎరువుల బస్తాలు అగ్నికి ఆహుతయ్యాయి. రాత్రి దుకాణం మూసివేసిన తరువాత కొద్దిసేపటికి దుకాణం నుంచి పొగలు రావడం ప్రారంభమైంది. గమనించిన స్థానికులు వెంటనే దుకాణం యజమానికి సమాచారం అందించారు. అతడు తిరిగి దుకాణం వద్దకు వచ్చి తలుపులు తెరిచి చూడగా దుకాణంలో మంటలు కనిపించాయి. పలు బస్తాలు అగ్నికి ఆహుతయ్యాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. ఘటనలో లక్షలాది రూపాయల మేర నష్టం వాటిల్లింది. విద్యుత్ షార్టు సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగిందని సమాచారం.

యువత రక్తదానం చేయాలి

యువత రక్తదానం చేయాలి

యువత రక్తదానం చేయాలి