
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని స్థిరంగా ఉంచాం
● హోం మంత్రి డాక్టర్ జీ.పరమేశ్వర్
హొసపేటె: కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వచ్చే డబ్బు తగినంతగా అందకపోయిన, మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని స్థిరంగా ఉంచాం. మన రాష్ట్రం జీఎస్టీ వసూళ్లలో దేశంలోనే 2వ స్థానంలో ఉంది. జీడీపీలో కూడా ముందంజలో ఉంది. రాష్ట్రం దివాలా తీసి ఉంటే ఇదంతా సాధ్యం అయ్యేది కాదని హోం మంత్రి డాక్టర్ జీ.పరమేశ్వర్ తెలిపారు. కొప్పళ జిల్లా కుకనూరు తాలూకా శిరూరు గ్రామంలో మాజీ మంత్రి కేహెచ్.పాటిల్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. త్వరలో 1000 మంది పీఎస్సై పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. పేదలకు హామీ పథకాలు ఇచ్చాం, మా ప్రత్యర్థులు ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు హామీ పథకాలను విమర్శించారు. ఈ రాష్ట్రం దివాళా తీస్తుందని అన్నారు. కానీ వారే మా హామీలను కాపీ కొట్టారని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మంచి పథకాలను అమలు చేశాం, మంచి పాలన అందించాం. ఎన్నికల మ్యానిఫెస్టోలో మేం చెప్పింది ఇదేనని, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆర్థిక భద్రతను సృష్టించారని అన్నారు.
ఆ ఆరోపణలు తీవ్రమైనవి కావు
మా ప్రభుత్వంలో డబ్బుకు కొరత లేదు, మాకు మంచి పాలన ఉంది, ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆధ్వర్యంలో రాబోయే మూడు సంవత్సరాలు కూడా మంచి పాలన అందించాలని నిర్ణయించామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రులు శివరాజ్ తంగడిగి, కేహెచ్ పాటిల్ ముఖ్యమంత్రి ఆర్థిక సలహాదారు, ఎమ్మెల్యే బసవరాజ రాయరెడ్డి, ఎమ్మెల్యే రాఘవేంద్ర హిట్నాల్, ఎంపీ రాజశేఖర్ హిట్నాల్ తదితరులు పాల్గొన్నారు.