
పామకాటుతో బాలుడి మృతి
దొడ్డబళ్లాపురం: పాము కాటుకు బాలుడు మృతిచెందిన ఘటన బెళగావి జిల్లా అథణి తాలూకా కమరి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అమిత్ గురులింగ(10) గతనెల 31న ఇంటి వద్ద ఉండగా పాము కాటు వేసింది. అతన్ని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. కాగా కాటు వేసిన పామును రెండు రోజుల తరువాత గుర్తించి బంధించి అడవిలోకి వదిలేశారు.
గుండెపోటుతో ఉద్యోగి మృతి
మైసూరు: కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తుండగా రెవెన్యూ శాఖ ఉద్యోగి ఒకరు గుండెపోటుతో మరణించిన ఘటన చామరాజనగర జిల్లా యళందూరులో జరిగింది. యళందూరు పట్టణంలోని రెవెన్యూ శాఖ డీ గ్రూప్ ఉద్యోగి శ్రీనివాస నాయక(51) ఇతను కార్యాలయంలో పని చేస్తుండగా గుండెపోటుకు గురయ్యాడు. పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుని అంత్యక్రియలు యళందూరు పట్టణంలో జరిగాయి.
60 అడుగుల బావిలో పడిన ఆవు
● రక్షించిన అగ్నిమాపక సిబ్బంది
మైసూరు: బావిలో పడిన ఓ ఆవును అగ్నిమాపక సిబ్బంది రక్షించిన ఘటన చామరాజనగర జిల్లా హనూరు తాలూకా ఆర్ఎస్దొడ్డి గ్రామంలో జరిగింది. గ్రామంలోని ముద్దప్ప బడావణెలో నంజుండస్వామి అనే వ్యక్తికి చెందిన ఆవు మేతకు వెళ్లి 60 అడుగుల లోతైన బావిలో పడింది. గమనించిన యజమాని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న సిబ్బంది లోపలకు దిగి తాళ్ల సహాయంతో ఆవును వెలికితీసి కాపాడారు. అగ్నిమాపక దళ అధికారి మహేష్, సిబ్బంది ఆనంద్ కుమార్, అశోక్, బసవరాజు, మనోహర్, హర్ష, లోకేష్ పాల్గొన్నారు.
సుహాస్శెట్టి హత్య కేసులో మరో నిందితుడి అరెస్ట్
యశవంతపుర: హిందూ సంఘాల కార్యకర్త సుహాస్శెట్టి హత్యోదంతంలో మరో నిందితుడు పట్టుబడ్డాడు. బజ్జె శాంతిగుడ్డెకి చెందిన అబ్దుల్ రజాక్(59) అనే వ్యక్తిని మంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. అబ్దుల్ రజాక్ కుమారుడు ముహమ్మద్ ముజాంమ్మిల్, కుతూరి భర్త (అల్లుడు) నౌషద్ వామంజూరుతో పాటు ఇతర నిందితులు తప్పించుకోవటానికి సహకరించిన అరోపణలతో అబ్దుల్ రజాక్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈకేసులో మరి కొంతమంది నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు మంగళూరు నగర పోలీసు కమీషనర్ సుధీర్కుమార్రెడ్డి తెలిపారు.
ఒకే రాత్రి 1.48 లక్షల బాక్స్ల బీరు తాగేశారు
యశవంతపుర: ఐపీఎల్ ఫైనల్లో ఆర్సీబీ గెలిచిన సంతోషంలో అభిమానులు బీరును ఏరులై పారించారు. మ్యాచ్ జరిగిన మంగళవారం రాత్రి రాష్ట్ర వ్యాప్తంగా రూ.30.66 కోట్ల విలువైన 1.48 లక్షల బాక్స్లు బీరు తాగారు. బుధవారం సాయంత్రం అభినందన కార్యక్రమం ఉండటంతో మంగళవారం రాత్రికంటే బుధవారం అధికంగా బీయర్ను ఖర్చే చేసే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. బీర్ కోసం వైన్షాపుల ముందు పడిగాపులు కాశారు.
ఆర్సీబీ విజయం..
ఉచితంగా ఓళిగ భోజనం
మైసూరు: ఐపీఎల్ క్రికెట్ టోర్నీలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టు విజేతగా నిలిచిన వేళ మైసూరులోని ఇందిరా క్యాంటీన్లలో బుధవారం ఉచితంగా ఓళిగ భోజనాన్ని వితరణ చేశారు. 18 ఏళ్ల చిరకాల వాంఛ సాకారం కావడంతో మైసూరులోని కేఆర్ బ్యాంక్ అధ్యక్షుడు బసవరాజ్ ఈ ఉచిత ఓళిగ భోజన వ్యవస్థ ఏర్పాటు చేశారు. మైసూరు నగరంలోని అన్ని ఇందిరా క్యాంటీన్లలో మధ్యాహ్నం 12 గంటలకు ఉచిత ఓళిగ భోజనం పంపిణీ చేశారు.
బండరాతితో బాది హత్య
చిక్కబళ్లాపురం: దుండగులు ఓ వ్యక్తిని బండరాతితో బాది హత్య చేశారు. ఈఘటన చిక్కబళ్లాపురం నగరంలోని బీబీ రోడ్డులో ఉన్న ఎస్బీఐ బ్యాంకు సమీపంలో జరిగింది. నగరంలోని చామరాజపేట కాలనీవాసి శ్రీకాంత్ (29) వెల్డింగ్ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. ఈయనకు భార్య, ఇద్దరు బిడ్డలు ఉన్నారు. బుధవారం ఉదయం బ్యాంకు సమీపంలో శ్రీకాంత్ రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉండగా స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్పీ కుశాల్చౌక్సి, పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహం పక్కనే బండరాయి ఉండటం, దానికి రక్తం అంటడంతో హత్యకు గురైనట్లు నిర్ధారించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

పామకాటుతో బాలుడి మృతి

పామకాటుతో బాలుడి మృతి