
ఐపీఎల్లో ఆర్సీబీ జట్టు గె లుపొందాలి
● సీఎం సిద్దరామయ్య అభిలాష
హుబ్లీ: అత్యంత ఉత్కంఠ రేపిన ఐపీఎల్– 2025 క్రికెట్ పోటీల ఫైనల్లో పంజాబ్ జట్టుతో తలపడుతున్న ఆర్సీబీ జట్టు గెలవాలని సీఎం సిద్దరామయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. గదగ్ జిల్లా లక్కుండిలో ప్రాచీన వస్తువుల తవ్వకాలను ప్రారంభించి ఆయన మాట్లాడారు. ఈసారి ఫైనల్కు వచ్చిన ఆర్సీబీ జట్టు మంచి ఊపు మీద ఉందన్నారు. పంజాబ్ జట్టు ఆర్సీబీ కన్నా ముందు క్వాలిఫైడ్ మ్యాచ్లో 101కే ఆలౌట్ అయిందన్నారు. ఆ తర్వాత ముంబైపైన గెలిచిందన్నారు. ముంబై కూడా స్ట్రాంగ్ టీం. అందులో కూడా మంచి ఆటగాళ్లు ఉన్నారు. ఈ సారి ఆర్సీబీ కప్ గెలవాలన్నదే అందరి ఆకాంక్ష అని, తాను కూడా ఆ జట్టు గెలవాలని కోరుకుంటున్నానన్నారు. ఒక వేళ జట్టు గెలవక పోయినా గెలిచిన జట్టుకు అభినందనలు తెలుపుతానన్నారు.
హెచ్ఎంపై కమీషన్ ఆరోపణలు
హుబ్లీ: ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తాను పని చేసే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసే షూ, సాక్స్ తదితరాల్లో సంబంధిత కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ రూపంలో లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. జిల్లాలోని నవలగుంద తాలూకా అణ్ణిగేరి ఉర్దూ ఉన్నత పాఠశాలలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు బుర్హానుద్దీన్పై వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యా శాఖ డీడీ ఆ తాలూకా బీఈఓ, లోకాయుక్త పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆర్టీఐ కార్యకర్త మాబుసాబ్ మీడియాకు తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి, బీఈఓకు కూడా తెలియజేశానన్నారు. 2024 డిసెంబర్ 20న సదరు వస్తువుల పంపిణీకి రూ.1500 కమీషన్ను లంచంగా తీసుకున్నట్లు ఫిర్యాదు చేశానని మాబుసాబ్ ఓ ప్రకటనలో తెలిపారు.
టికెట్ లేని ప్రయాణికుల నుంచి జరిమానా వసూలు
హుబ్లీ: హుబ్లీ బీఆర్టీఎస్ బస్సుల్లో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారి నుంచి రూ.42 వేలు జరిమానా వసూలు చేశారు. టికెట్ లేకుండా, అనుమతి పొందిన పాస్కు విరుద్ధంగా విద్యార్థులు తదితరులకు విధించిన జరిమానా గత నెలలో సుమారు రూ.42 వేలు వసూలు చేసినట్లు వాయువ్య కర్ణాటక రోడ్డు రవాణా నగర విభాగం డీసీ ఓ ప్రకటనలో తెలిపారు. హుబ్లీ నగర పరిధిలో సిబ్బంది, అధికారుల బృందం 34 బీఆర్టీఎస్ బస్సుల్లోని పాయింట్లలో ఈ తనిఖీ కార్యాచరణ చేపట్టారు. ప్రయాణికులు టికెట్ తీసుకొని బీఆర్టీఎస్ బస్సుల్లో ప్రయాణించాలని, లేకుంటే జరిమానా విధిస్తామని సంబంధిత డివిజనల్ కంట్రోలర్ ఓ ప్రకటనలో తెలిపారు.
బాల్య వివాహాలను అరికట్టండి
రాయచూరు రూరల్: జిల్లాలో బాల్య వివాహాల నియంత్రణకు అధికారులు ముందడుగు వేయాలని జిల్లా పంచాయతీ ముఖ్య కార్యనిర్వహణాధికారి రాహుల్ తుకారాం పాండే పేర్కొన్నారు. సోమవారం మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో ఐసీడీఎస్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం పంపిణీ విషయంపై చర్చించారు. యువతులు, బాలింతలు, గర్భిణీలకు పౌష్టికాహారం అందించాలన్నారు. న్యూట్రిన్ పునర్ వసతి కేంద్రాల ద్వారా పిల్లల ఎదుగుదలకు చర్యలు తీసుకోవాలని సీడీపీఓలను ఆదేశించారు. సమావేశంలో సీడీపీఓ వెంకటేష్ దేశాయి, మహేష్ నాయక్, శరణమ్మలున్నారు.
గ్రంథాలయ భవనం
ప్రారంభమెప్పుడో?
హొసపేటె: కంప్లి పట్టణంలోని సోమప్పన కెరె క్యాంపస్లో దాదాపు రూ.కోటి ఖర్చుతో నిర్మించిన ప్రీ–ఇంజినీర్డ్ బిల్డింగ్(పీఈబీ) గ్రంథాలయం చాలా నెలలుగా ప్రారంభానికి నోచుకోకుండా ఉంది. ఇది స్థానిక విద్యార్థులు, ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. విద్యార్థులు, విద్యావంతులు ఈ ప్రాంత ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేస్తూ విద్యార్థుల విద్యా హక్కులను హరించకూడదని, గ్రంథాలయాన్ని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. స్థానిక అధికారులు, ఎమ్మెల్యే వెంటనే చర్యలు తీసుకొని గ్రంథాలయాన్ని ప్రజల ఉపయోగం కోసం తెరవాలని విద్యార్థులు, ప్రజలు ఒత్తిడి చేశారు.
పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించండి
మాలూరు : తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని హెచ్ హొసకోటె గ్రామ పంచాయతీ అధ్యక్షురాలు రాజేశ్వరి సుబ్రమణి పిలుపునిచ్చారు. బరగూరు గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో మంగళవారం ఆమె విద్యార్థులకు విద్యా సామగ్రిని అందించి మాట్లాడారు. సర్కార్ బడుల్లో పిల్లలందరికీ ఉచితంగా యూనిఫాం, బ్యాగు, భోజనం అందిస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మీడియం ప్రారంభిస్తుండడం విద్యార్థులకు ఎంతో అనుకూలంగా ఉంటుందన్నారు. ప్రధానోపాధ్యాయుడు ఎన్ వెంకటేష్, ఎస్డీఎంసీ అధ్యక్షుడు మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు.

ఐపీఎల్లో ఆర్సీబీ జట్టు గె లుపొందాలి