
జ్వరం, దగ్గు, జలుబు.. స్కూలుకు పంపొద్దు
పిల్లల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు సర్కారు సూచనలు
పాఠశాలల్లో కోవిడ్ నియంత్రణకు చర్యలు
శివాజీనగర(కర్ణాటక): రాష్ట్రమంతటా పాఠశాలలు పునర్ ప్రారంభం అవుతున్నాయి. ఇదే సమయంలో రాష్ట్రంలో కోవిడ్ దిగులు నెలకొంది. ఆరోగ్య శాఖ పాఠశాలల కోసం ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. కోవిడ్ సాంకేతిక కమిటీ ఆదేశాలతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు ముఖ్యమైన సూచనలను ఇచ్చింది.
ఇవీ మార్గదర్శకాలు
● పాఠశాల పిల్లల్లో జ్వరం, దగ్గు, జలుబు, ఇతర లక్షణాలు కనిపిస్తే బడికి పంపరాదు,
● వెద్యులతో చికిత్స చేయించాలి. సుస్తీ నయమైన తరువాతనే పిల్లలను పాఠశాలలకు పంపించాలి.
● జ్వరం, దగ్గు, జలుబు, ఇతర రోగ లక్షణాలు ఉన్న పిల్లలు పాఠశాలకు వస్తే, వారి తల్లిదండ్రులకు తక్షణమే సమాచారమిచ్చి ఆ పిల్లలను ఇంటికి పంపించాలి.
● పాఠశాల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందిలో జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలు కనిపిస్తే వైద్యసేవలను పొందాలి.
● అన్ని పాఠశాలల్లో కోవిడ్ ముందు జాగ్రత్తా చర్యలను తప్పకుండా పాటించాలి.
రాజధానిలో 150కి పైగా కేసులు
బెంగళూరులో కోవిడ్ కేసులు రోజురోజుకూ అధికమవుతున్నాయి. క్రియాశీల కేసులు 150 ని మించిపోయాయి. మహాదేవపుర, తూర్పు జోన్తో పాటుగా బెంగళూరులోని పలు ఏరియాల్లో కోవిడ్ బాధితులు పెరుగుతున్నారు. రోగ బాధితులు, వారి పక్కన ఉండేవారు కోవిడ్ నియమావళిని పాటించాలని వైద్య నిపుణులు తెలిపారు. ఎటువంటి పరిస్థితిని ఎదుర్కోవడానికై నా సిద్ధంగా ఉండాలి. వెంటిలేటర్లు, ఆక్సిజన్, బెడ్లకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం సిద్దరామయ్య ఆదేశించారు. కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. అయితే ఇది తీవ్రతరమైన వైరస్ కాదు. వృద్ధులు, వివిధ జబ్బు పీడితులు తప్పకుండా మాస్క్ ధరించాలి. అందరూ మాస్క్ ధరించాలన్న నియమం లేదు అని చెప్పారు.