
తుంగభద్ర నీటి విడుదలపై స్పష్టత ఇవ్వండి
సాక్షి,బళ్లారి: తుంగభద్ర జలాశయం నుంచి ఈ ఏడాది రైతులు నీరు పొందే విషయంపై ఆందోళన చెందుతున్నారని, ఈ విషయంపై ప్రభుత్వం రైతులకు భరోసా కల్పించాలని తుంగభద్ర రైతు సంఘం అధ్యక్షుడు దరూరు పురుషోత్తంగౌడ పేర్కొన్నారు. ఆయన శుక్రవారం నగరంలో విలేకరులతో మాట్లాడారు. గత ఏడాది ఖరీఫ్ సీజన్లో తుంగభద్ర డ్యాంలోకి భారీగా వచ్చిన వరదలతో 19వ క్రస్ట్గేట్ కొట్టుకు పోయిందని గుర్తు చేశారు. అష్టకష్టాలతో క్రస్ట్గేటు యథావిఽఽధిగా అమర్చడం వల్ల ఖరీఫ్, రబీ పంటలకు నీరు అందాయన్నారు. అయితే క్రస్ట్గేట్లు అన్నింటికీ మరమ్మతులు చేయాలని, అవి సక్రమంగా లేవని నిపుణులు, ప్రభుత్వ పెద్దలు కూడా సూచించారని గుర్తు చేశారు. అయినా ఈ విషయంలో అధికారులు ఎందుకు పక్కా చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. అధికారులు చొరవ తీసుకోవాలని నీటిపారుదల శాఖ నిపుణులు సూచించినా క్రస్ట్గేట్లు మరమ్మతులు చేయక పోవడంతో ఆయకట్టు రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. 33 క్రస్ట్ గేట్లను మార్చాల్సిన అవసరం ఉందని నిపుణులు ఇచ్చిన సూచనలను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ఈ ఏడాది రైతుల పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. తుంగభద్ర డ్యాం నీటి పారుదల సలహా సమితి అధ్యక్షుడు శివరాజ్ తంగడిగి రబీలో నీటి విడుదలను నిలుపుదల చేసి క్రస్ట్ గేట్లను మరమ్మతు చేస్తామని చెప్పినా ఆ పనులు ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. ప్రస్తుతం డ్యాంలోకి ఇన్ఫ్లో వస్తోందని, ఖరీఫ్ సీజన్ కూడా ప్రారంభం అయిందన్నారు. త్వరలో కాలువలకు కూడా నీరు వదలాల్సిన పరిస్థితులు ఉన్నందున రైతులకు భరోసా కల్పించాలని కోరారు. ఈసందర్భంగా రైతు సంఘం నాయకులు భీమన్నగౌడ, మల్లప్ప, గోవిందప్ప తదితరులు పాల్గొన్నారు.
క్రస్ట్గేట్లకు ఎందుకు మరమ్మతులు చేయలేదు?
అధికారులపై రైతు సంఘం అధ్యక్షుడు మండిపాటు