
ఆలమట్టికి పోటెత్తిన వరద
రాయచూరు రూరల్: మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మకు వరద పోటెత్తింది. ఫలితంగా ఆలమట్టి జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. రెండు రోజులుగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మరో వైపు ఉపనది మలప్రభ ఉధృతంగా ప్రవహిస్తోంది. ముదోళ్ తాలూకా ధవళేశ్వరం బ్రిడ్జి కమ్ బ్యారేజీని వరద జలాలు తాకుతూ ప్రవహిస్తున్నాయి. మహారాష్ట్రలోని రాజాపూర్, హిప్పరిగి జలాశయాల నుంచి వరద నీరు అలమట్టికి చేరుతున్నాయి. దీంతో 50 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు. గుర్జాపూర వంతెన గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.
యాదగిరి జిల్లాలో భారీ వర్షాలు
యాదగిరి జిల్లాలో కుంభవృష్టి కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. శహపుర తాలూకా యడళ్లిలో ఇళ్లలోకి నీరు చేరి వస్తు సామగ్రి, ధాన్యం తడిసి ప్రజలు నిరాశ్రయులయ్యారు. యాదగిరిలోని విద్యాభారతి పాఠశాల వద్ద రైల్వే అండర్ బ్రిడ్జిపైకి వరద నీరు చేరింది. వరదతో కృష్ణా నది పోటెత్తుతుండటందతో ప్రజలు నీటి వనరుల వద్దకు వెళ్లరాదని అధికారి నితీష్ ఆదేశాలు జారీ చేశారు.

ఆలమట్టికి పోటెత్తిన వరద