
తాళె బసాపుర తండాలో దాహం కేకలు
హొసపేటె: విజయనగర జిల్లా హొసపేటె తాలూకాలోని తాళె బసాపుర తండాలో తాగునీటి సమస్య నానాటికీ తీవ్రమవుతోంది. ఖాళీ బిందెలతో క్యూలో నిలబడి ఉన్న మహిళలు గ్రామ పంచాయతీ సభ్యులను, అధికారులను నిత్యం శాపనార్థాలు పెడుతున్నా నీరు సరిగ్గా సరఫరా కావడం లేదని ఫిర్యాదు చేస్తున్నా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రజలు తమ రోజువారీ పనులను వదిలిపెట్టి నీటి కోసం మాత్రమే ఎదురు చూస్తున్న దృశ్యాలు తాళె బసాపుర తండాలో కనిపించాయి. తాళె బసాపుర తండాలో తాగునీటి కోసం మహిళలు, పిల్లలు నానాపాట్లు పడుతున్నారు.
తాలూకాలోనే అతి పెద్ద తండా
తండాలో దాదాపు 3 వార్డులు, 800కి పైగా ఇళ్లు, దాదాపు 8 మంది గ్రామ పంచాయతీ సభ్యులు ఉన్నారు. ఈ తండా తాలూకాలోని తండాల్లో అతిపెద్దది. మూడు వార్డుల్లో రెండింటిలో కొళాయి నుంచి కొద్దిగా నీరు వస్తుంది. ఈ చుక్కల నీటి కోసం గ్రామస్తులు తమ సొంత పనులు వదులుకొని నీటి కోసం గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా ఇక్కడ గ్రామస్తులు ఇంకా మంచినీటి ఎద్దడితో నిత్యం నరకయాతన పడుతున్నారు. జిల్లా సరిహద్దుల్లో తుంగభద్ర జలాశయం ఉన్నా ప్రజలకు తాగునీటి సౌకర్యం కరువైంది. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు, అధికారులు తండాలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.
పనులు మానుకొని నీటి కోసం పాట్లు
పట్టించుకోని పాలకులు, అధికారులు

తాళె బసాపుర తండాలో దాహం కేకలు