
కారు ఢీకొని వ్యక్తి మృతి
హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా క్యాసనకెరె గ్రామం వద్ద జాతీయ రహదారి–50ని దాటుతుండగా మంగళవారం రాత్రి కారు ఢీకొనడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని హగరిబొమ్మనహళ్లి తాలూకాలోని హొసకెరె గ్రామానికి చెందిన హెచ్.స్వామి(35)గా గుర్తించారు. తన భార్య స్వస్థలం కూడ్లిగి తాలూకాలోని ఐగళ మల్లాపుర వెళ్లడానికి స్వామి తన స్వగ్రామం నుంచి బస్సులో వచ్చాడు. క్యాసనకెరె క్రాసింగ్ వద్ద దిగి హైవే దాటుతుండగా, ఆయనను కారు ఢీకొట్టింది. ప్రమాద అనంతరం డ్రైవర్ కారు ఆపకుండా అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన స్వామి అక్కడికక్కడే తుది శ్వాస విడిచారు. ఎస్పీ శ్రీహరిబాబు, డీఎస్పీ మల్లేష్ దొడ్డమని, కానాహొసహళ్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ సిద్రం బిదరాణితో సహా పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం కూడ్లిగి ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. కానాహొసహళ్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
కోటలను అభివృద్ధి చేయండి
రాయచూరు రూరల్: నగరంలో చారిత్రక కోటల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు జిల్లాధికారి నితీష్కు సూచించారు. బుధవారం బసవేశ్వర సర్కిల్ వద్ద ఆయన అధికారులతో మాట్లాడారు. నగర పరిధిలోని కోటలలో పరిశుభ్రత కాపాడడం, వాటిని రక్షించడం, ఇతర అభివృద్ధి పనులు చేయించాలన్నారు. బస్టాండ్ వద్ద గల మక్కా దర్వాజ, నవరంగ్ దర్వాజ, ఇతర ప్రాచీన కోటల కట్టడాలను బలవర్దనం చేయడానికి నిధులు కేటాయిస్తామన్నారు. రూ.కోటితో పనులు మొదలు పెట్టాలని సూచించారు. మంత్రి వెంట నగరసభ కమిషనర్ జుబీన్ మహపాత్రో, ఏసీ గజానన బళి, ఏఎస్పీ హరీష్, నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, సభ్యులు జయన్న, రమేష్లున్నారు.