ఈడీ అదుపులో ఐశ్వర్యగౌడ | - | Sakshi
Sakshi News home page

ఈడీ అదుపులో ఐశ్వర్యగౌడ

Apr 27 2025 12:58 AM | Updated on Apr 27 2025 12:58 AM

ఈడీ అ

ఈడీ అదుపులో ఐశ్వర్యగౌడ

బనశంకరి: బంగారం, నగదు చీటింగ్‌ కేసుల్లో నిందితురాలు ఐశ్వర్యగౌడ నివాసాల్లో ఈడీ అధికారులు జరిపిన సోదాల్లో పలు సాక్ష్యాధారాలు, డిజిటల్‌ పరికరాలతో పాటు రూ.2.25 కోట్ల నగదు పట్టుబడింది. దీనిపై ఆమెను ప్రశ్నించగా సరైన సంజాయిషీ ఇవ్వకపోవడంతో విచారణ చేపట్టడానికి అరెస్ట్‌ చేశారు. ఐశ్వర్యగౌడను బెంగళూరు ప్రత్యేక ఆర్థిక విభాగం కోర్టులో హాజరుపరచగా 14 రోజులు కస్టడీకి కోర్టు ఆదేశించిందని ఈడీ అధికారులు తెలిపారు. మాజీ ఎంపీ డీకే.సురేశ్‌ సోదరినంటూ చెప్పుకుని పలు బంగారం షాపుల నుంచి కోట్లాది రూపాయల విలువచేసే బంగారు నగలను తీసుకుని నగదు ఎగ్గొట్టినట్లు కేసులున్నాయి. ఐశ్వర్యగౌడను ఈడీ అధికారులు విచారణ చేపట్టారు.

సైకో అరెస్టు

యువతి, స్నేహితునిపై దాడి

బనశంకరి: ప్రేమించాలని వేధించి యువతి, ఆమె స్నేహితునిపై దాడి చేసిన సైకో ని నగరంలో బనశంకరి పోలీసులు అరెస్ట్‌చేశారు. 21 ఏళ్ల యువతి, ఆమె స్నేహితునిపై ఈ నెల 8వ తేదీన దేవేగౌడ పెట్రోల్‌బంక్‌ వద్ద కట్టర్‌తో దాడికి పాల్పడిన శ్రీకాంత్‌ (45) నిందితుడు. కమలానగరలో శ్రీకాంత్‌ నివాసంలో సదరు వివాహిత యువతి ఏడాదిపాటు అద్దెకు ఉండింది. వివాహితుడైన శ్రీకాంత్‌ తనను ప్రేమించాలని ఆమెను సతాయించేవాడు. దీంతో యువతి తన భర్తకు చెప్పి బసవేశ్వరనగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదుచేసిన పోలీసులు శ్రీకాంత్‌ ను పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. యువతి ఇంటిని ఖాళీ చేసి కురబరహళ్లిలో చేరింది. మూడు నెలల నుంచి శ్రీకాంత్‌ యువతిని వెంబడించి ఆమె చదువుతున్న కాలేజీకి వెళ్లేవాడు. 8వ తేదీన పెట్రోల్‌ బంక్‌ వద్ద బస్టాప్‌లో ఆమె స్నేహితునితో కూర్చుని ఉంది. శ్రీకాంత్‌ వెళ్లి అతన్ని ప్రేమిస్తున్నావా అని యువతి, ఆమె స్నేహితుని చెంపలపై కొట్టాడు. కటర్‌తో ఇద్దరి ముఖంపై దాడిచేసి ఉడాయించాడు. పోలీసులు శనివారం శ్రీకాంత్‌ను అరెస్ట్‌ చేసి విచారణ చేపట్టారు.

సిద్దు సీఎం..

కర్ణాటక దౌర్భాగ్యం

అశోక్‌ మండిపాటు

శివాజీనగర: పాకిస్తాన్‌తో యుద్ధం అనివార్యం కాదన్న సీఎం సిద్దరామయ్య వ్యాఖ్యల మీద బీజేపీ పక్ష నేత ఆర్‌.అశోక్‌ మండిపడ్డారు. సిద్దరామయ్య ముస్లిం ఓట్ల గురించి ఆలోచిస్తున్నారు, అలాగైతే దాడుల్లో చనిపోయినవారి ప్రాణానికి విలువ లేదా? దేశానికి ఏమైనా ఫర్వాలేదు, ఓట్లు వస్తే చాలు అనే మనస్తత్వం ఆయనది అని ధ్వజమెత్తారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న, రెండుసార్లు సీఎం అయిన సీఎం సిద్దరామయ్యకు ఏ సందర్భంలో ఏమి మాట్లాడాలనే కనీస పరిజ్ఞానం లేకపోవటం కర్ణాటక దౌర్భాగ్యం అని దుయ్యబట్టారు. పాక్‌ ఉగ్రవాదుల దాడి భారతదేశ సార్వభౌమత్వానికి, గౌరవానికి సవాల్‌గా మారిందన్నారు. ఇటువంటి సమయాలలో పార్టీలకతీతంగా ఉద్యమించాలన్నారు. రాష్ట్రంలో వేల సంఖ్యలో బంగ్లాదేశీలు, రోహింగ్యాలు, పాకిస్తానీ అక్రమ వలసదారులు దర్జాగా తిరుగుతున్నారు. ముందు వారిని గుర్తించి, ఇక్కడి నుండి వెళ్లగొట్టి కన్నడిగుల క్షేమాన్ని కాపాడాలని డిమాండ్‌ చేశారు. సంబంధం లేని అంశాలపై జోక్యం చేసుకోవద్దని మండిపడ్డారు.

ఎమ్మెల్యే కొడుకుచే

టోల్‌గేటు ధ్వంసం

రాయచూరు రూరల్‌: మా అమ్మ చెబితే పట్టించుకోరా, మీకెంత ధైర్యం అని రాయచూరు– దేవదుర్గ మధ్యనున్న టోల్‌ గేట్‌ను ఎమ్మెల్యే కుమారుడు ధ్వంసం చేశాడు. వివరాలు... కాకర వద్ద గల టోల్‌గేట్‌ ఉండగా, వాహనదారులు టోల్‌ ఫీజులను చెల్లించడం కష్టంగా ఉందని, దానిని తొలగించాలని దేవదుర్గ శాసన సభ్యురాలు కరెమ్మ నాయక్‌ హైవే అధికారులకు సూచించారు. టోల్‌ గేట్‌ను తీసివేయడం కుదరదని అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే పుత్రుడు సంతోష్‌ నాయక్‌, ఆమె సోదరుడు తిమ్మారెడ్డి నాయక్‌ల ఆధ్వర్యంలో యువకులు టోల్‌ గేట్‌ ఆఫీసు, అందులోని కంప్యూటర్లు, ఇతర సామగ్రిని ధ్వంసం చేశారని అధికారి నవీన్‌ కుమార్‌ గబ్బూరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసుల కేసు నమోదు చేశారు.

ఈడీ అదుపులో ఐశ్వర్యగౌడ 1
1/2

ఈడీ అదుపులో ఐశ్వర్యగౌడ

ఈడీ అదుపులో ఐశ్వర్యగౌడ 2
2/2

ఈడీ అదుపులో ఐశ్వర్యగౌడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement