
కార్యాలయం తరలింపుపై నిరసన
బళ్లారి అర్బన్: బళ్లారిలోని చేనేత, జవళి శాఖ జేడీ కార్యాలయాన్ని కలబుర్గికి తరలించే ప్రయత్నాలను తక్షణమే విరమించుకోవాలని నగరంలో భారీ ఆందోళన చేపట్టారు. బళ్లారి జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్, సామాజిక పోరాట యోధుడు, ప్రముఖ సీఏ సిరిగేరి పన్నారాజ్, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు యశ్వంత్రాజ్ నాగిరెడ్డి సారథ్యంలో గాంధీ భవన్ నుంచి జిల్లాధికారి కార్యాలయం వరకు ఈ ఆందోళన చేపట్టారు. నేతలు మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నుంచి బళ్లారితో పాటు పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లోని సరిహద్దు ప్రాంతాల్లో రెడీమేడ్ పరిశ్రమ కుటీర పరిశ్రమగా అభివృద్ధి చెందిందన్నారు. బళ్లారిలో 200 వరకు గార్మెంట్ తయారీ యూనిట్లు ఉన్నాయన్నారు. జీన్స్ గార్మెంట్స్, జీన్స్ వాషింగ్, జాబ్ వర్కింగ్ యూనిట్లు పని చేస్తున్నాయి. నగరంలో 50 వేల మందికి పైగా దీని వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ఆ మేరకు ప్రతి ఏటా రూ.2 వేల కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయన్నారు. యశ్వంత్రాజ్ నాగిరెడ్డి మాట్లాడుతూ బళ్లారి కేంద్రంగా బళ్లారి జీన్స్ అపారల్ పార్క్ నాలుగో దశ ముండ్రగి పారిశ్రామికవాడలో, అలాగే 80కి పైగా జీన్స్ వాషింగ్ యూనిట్లు, 1000 మందికి పైగా ఉపాధికి ప్రతిపాదన ఉందన్నారు. మొత్తానికి బళ్లారి నగరంలో టెక్స్టైల్ పార్క్కు అన్ని విధాలుగా వసతులు ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా సీఎంకు రాసిన వినతిపత్రాన్ని డీసీ కార్యాలయ ప్రతినిధికి అందజేశారు. ఆందోళనలో ప్రముఖులు మహారుద్రగౌడ, దొడ్డనగౌడ, సురేష్బాబు, డాక్టర్ మర్చేడ్ మల్లికార్జున, వీ.రామచంద్ర, జిల్లా కాటన్ అసోసియేషన్, గార్మెంట్స్ తయారీదారుల సంఘం, బళ్లారి జీన్స్ వాషింగ్ అసోసియేషన్, బళ్లారి టైలరింగ్ అసోసియేషన్, జిల్లా ఇండస్ట్రీస్ అసోసియేషన్ ప్రతినిధులతో పాటు జిల్లాలోని వివిధ సంఘాల నేతలు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు పాల్గొన్నారు.
ఆ కార్యాలయం బళ్లారిలోనే ఉండాలి
చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యుల డిమాండ్

కార్యాలయం తరలింపుపై నిరసన