హుజూరాబాద్ రుణం తీర్చుకుంటా
హుజూరాబాద్/ఇల్లందకుంట: రాజకీయ జన్మనిచ్చి, శాసనమండలి సభ్యుడిగా నిలబెట్టిన హుజూరాబాద్ గడ్డరుణం తీర్చుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని ఎమ్మెల్సీ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు బల్మూరి వెంకట్ అన్నారు. శనివారం హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్లను సత్కరించారు. ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తిగా ఎదుగుతోందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నాయన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించాలని శతవిధాలా ప్రయత్నించారని విమర్శించారు. ఎన్ని కుట్రలు చేసినా 30కి పైగా స్థానాల్లో తమ అభ్యర్థులు విజయం సాధించారన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. టీపీసీసీ సభ్యుడు పత్తి కృష్ణారెడ్డి, ఇల్లందకుంట ఆలయ చైర్మన్ రామారావు తదితరులు పాల్గొన్నారు.
22 నుంచి నట్టల నివారణ మందు పంపిణీ
కరీంనగర్రూరల్: రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 22నుంచి గొర్రెలు, మేకలకు ఉచితంగా నట్టల నివారణ మందును పంపిణీ చేస్తామని పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ప్రాధమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘం కరీంనగర్ జిల్లా అడహక్ కమిటీ చైర్మన్ బాషవేణి మల్లేశం యాదవ్ ఆధ్వర్యంలో శనివారం మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసి గొర్రెలకు నట్టల నివారణ మందులను పంపిణీ చేయకపోవడంతో గొర్రెకాపరులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. స్పందించిన ప్రభాకర్ వెంటనే సంబంధిత పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి వద్దకు మల్లేశం బృందాన్ని తీసుకెళ్లారు. నట్టల మందు పంపిణీ చేయాలని వినతిపత్రం ఇచ్చారు. ఈ నెల 22నుంచి మందు పంపిణీ చేసేందుకు ఏర్పా ట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. దీంతో మంత్రులకు మల్లేశం కృతజ్ఙతలు తెలిపారు. అడహక్ కమిటీ సభ్యులు కాల్వ సురేశ్, దాడి అంజనేయులు, సతీశ్, రంజిత్, రవీందర్, వెంకటేశంగౌడ్ పాల్గొన్నారు.
బీసీలను మోసం చేసిన సీఎం రేవంత్రెడ్డి
కరీంనగర్టౌన్: సీఎం రేవంత్రెడ్డి బీసీలను మోసం చేశాడని, 42శాతం రిజర్వేషన్లపై చెప్పేదొకటి, చేసేదొకటి అని, పరిషత్ ఎన్నికలకు 42శాతం రిజర్వేషన్లు ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లం లింగమూర్తి డిమాండ్ చేశారు. జిల్లాకేంద్రంలో శనివారం మాట్లాడుతూ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం.. 42శాతం రిజర్వేషన్లు ఇవ్వకుంటే పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెంట అజయ్ పటేల్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర సమైక్య కార్యదర్శి తవటం సత్యం, కరీంనగర్ పార్లమెంట్ ఇన్చార్జి కాలువ మధుబాబు, బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గరిగె కోటేశ్వర్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, గుగ్గిళ్ల మహేశ్ పాల్గొన్నారు.
రేషన్కు ఈకేవైసీ తప్పనిసరి
కరీంనగర్ అర్బన్: రేషన్ కార్డుదారులందరూ తప్పకుండా ఈకేవైసీ చేసుకోవాలని జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింగరావు తెలిపారు. జిల్లాలో 3,17,748 రేషన్కార్డులుండగా 9,45,605 మంది సభ్యులున్నారని పేర్కొన్నారు. ఇందులో 7,20,517 మంది మాత్రమే ఈ– కేవైసీ చేసుకున్నారని, మిగతా రేషన్కార్డుదారులు సమీప రేషన్ దుకాణానికి వెళ్లి సదరు ప్రక్రియను పూర్తి చేయాలని వివరించారు. కార్డుదారుతో పాటు కార్డులో ఉన్నవారంతా రేషన్ దుకాణంలో వేలిముద్ర, ఐరిస్ చేయించుకోవాలని సూచించారు.
హుజూరాబాద్ రుణం తీర్చుకుంటా
హుజూరాబాద్ రుణం తీర్చుకుంటా


