సంబురంగా స్నాతకోత్సవం
బిజీబిజీగా గవర్నర్ పర్యటన
శాతవాహన వర్సిటీలో పట్టాలు, పీహెచ్డీలు అందజేసిన జిష్ణుదేవ్ వర్మ
కలెక్టరేట్లో స్టాళ్లు పరిశీలన
జిల్లా అభివృద్ధి, పథకాల అమలుపై సమీక్ష
సాక్షిప్రతినిధి,కరీంనగర్/కరీంనగర్:
రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జిల్లా పర్యటన శుక్రవారం బీజీబిజీగా సాగింది. ఉదయం 10 గంటలకే నగరానికి చేరుకున్న ఆయన శాతవాహన యూనివర్సిటీ రెండో స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌస్ ఆలం, వీసీ ఉమేశ్కుమార్ ఘనస్వాగతం పలికారు. వీర్సిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 25 మందికి పీహెచ్డీ పట్టాలు, 2018 నుంచి 2023 వరకు డిగ్రీ, పీజీ విద్యలో ప్రతిభ కనబరిచిన 161 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్వర్మ మాట్లాడుతూ క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం విద్యార్థులను విజయం దిశగా తీసుకెళ్తుందన్నారు. శాతవాహన విశ్వవిద్యాలయానికి న్యాక్, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ దిశగా అధ్యాపకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబా ద్ వీసీ జేబీరావు మాట్లాడుతూ.. అనతికాలంలోనే వర్సిటీ సాధించిన పురోగతిని కొనియాడారు. వర్సిటీకి పరిశోధనలు, ఇతర అంశాల్లో కావాల్సిన సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నా రు. అంతకుముందు వీసీ ఉమేశ్కుమార్ వర్సిటీ సాధించిన పురోగతిని, విజయాలను వివరించారు.
స్టాళ్ల పరిశీలన
ఎస్యూలో కార్యక్రమం అనంతరం గవర్నర్ ప్రత్యే క కాన్వాయ్ ద్వారా కలెక్టరేట్కు చేరుకున్నారు. ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆడిటోరియంలో కలెక్టర్ పమేలా సత్పతి జిల్లా సమగ్ర స్వరూపంతో పాటు జిల్లా విశేషాలను పవర్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని లెక్కలతో సహా అందించారు. అనంతరం కలెక్టరేట్లో వివిధశాఖల వారీ గా ఏర్పాటు చేసిన స్టాళ్లను గవర్నర్ పరిశీలించారు. చాలా అద్భుతంగా ఉన్నాయని కలెక్టర్, జిల్లా యంత్రాంగాన్ని ప్రశంసించారు. వందేమాతర గీతాపాలనలో పాల్గొన్నారు. బాలభవన్ విద్యార్థుల శాసీ్త్రయ నృత్యం, అంధ విద్యార్థుల పాటలను తిలకించారు.
జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి
కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా అధికారులు, ప్రముఖులతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖాముఖి నిర్వహించారు. జిల్లా సర్వతోముఖాభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ను టీబీ, మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మార్చేందుకు సంసిద్ధంగా ఉండాలన్నారు. జిల్లాలో ఉన్న మేధావులు, విద్యావంతులు జ్ఞానాన్ని సమాజానికి పంచాలని సూచించారు. అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన ప్రముఖులను సన్మానించారు. సన్మానం పొందినవారిలో డాక్టర్ లక్ష్మీనారాయణ, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నలిమేల భాస్కర్, గద్దర్ అవార్డు గ్రహీత పొన్నం రవీచంద్ర, దాశరథి పురస్కార గ్రహీత అన్నవరం దేవేందర్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గండ్ర లక్ష్మణరావు, సినీనటుడు కేతిరెడ్డి మల్లారెడ్డి, నటుడు, దర్శకుడు ఆర్.ఎస్. నంద సైంటిస్ట్ వెంకటేశ్వరరావు, ఎన్జీవో గంప వెంకట్, అల్ఫోర్స్ నరేందర్రెడ్డి, యాదగిరి శేఖర్రావు, సింగర్ ఎం.ఎం. శ్రీలేఖ, రెడ్క్రాస్ చైర్మన్ పెండ్యాల కేశవరెడ్డి, వైస్ చైర్మన్ చిదుర సురేశ్, సెక్రటరీ ఉట్కూరి రాధాకృష్ణరెడ్డి, స్టేట్ ఈసీ మెంబర్ పెద్ది విద్యాసాగర్, ఎంజేఎఫ్ చైర్మన్ కొండ వేణుమూర్తి, ఐపీఎంసీసీ హనుమండ్ల రాజిరెడ్డి, ఎల్టీ కోఆర్డినేటర్ ఏనుగుర్తి రమేశ్, రీజియన్ చైర్పర్సన్ వడుకపురం జగదీశ్వర చారి ఉన్నారు. గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్, సీపీ గౌస్ ఆలం, అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మి కిరణ్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డీఆర్వో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
భారీ బందోబస్తు
గవర్నర్ జిల్లా పర్యటన నేపథ్యంలో నగరంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. వర్సిటీతోపాటు గవర్నర్ కాన్వాయ్ ప్రయాణించిన పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గవర్నర్ సాయంత్రం హైదరాబాద్ వెళ్లేంత వరకు పోలీసులు పటిష్ట బందోబస్తు కల్పించారు. సీపీ నిరంతరం ఏర్పాట్లను పర్యవేక్షించారు.
సంబురంగా స్నాతకోత్సవం
సంబురంగా స్నాతకోత్సవం
సంబురంగా స్నాతకోత్సవం


