
నిగ్గు తేలేనా.. పాత కథేనా?
● పత్తి కొనుగోళ్ల అవకతవకలపై సాగుతున్న విచారణ ● టీఆర్ వివరాలు ఇవ్వడానికి మల్లగుల్లాలు ● 2004– 07 అక్రమాలు అటకెక్కినట్టేనా?
కరీంనగర్ అర్బన్: పత్తి కొనుగోళ్లలో భారీగా అక్రమాలు జరిగాయని ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా పదిమందికి పైగా మార్కెట్ కార్యదర్శులతో పాటు డీఎంవోలను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. పక్షం రోజులకు పైగా గడిచినా నామమాత్రపు వివరాలతో సరిపుచ్చారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో మళ్లీ విచారణ సాగుతుండగా పాత కథనే మరిపిస్తారా.. నిజాలను నిగ్గు తేలుస్తారా అనేది త్వరలోనే తేలనుంది. 2004–07 సంవత్సరాల్లో ఇదే తరహాలో అక్రమాలు జరగ్గా సీబీఐ రంగంలోకి దిగినా రాజకీయ పలుకుబడితో ఎవరిపై చర్యలు లేకపోగా విచారణ అటకెక్కిందనే ఆరోపణలున్నాయి.
జిల్లాలోని అధికారులకు మెమోలు?
జిల్లాలోని మార్కెట్ అధికారులకు, కార్యదర్శులకు విజిలెన్స్ అధికారులు మెమోలు జారీ చేసినట్లు సమాచారం. టీఆర్ (తాత్కాలిక రిజిస్ట్రేషన్)ల జారీ లో ఎక్కడ అవకతవకలు జరిగాయో పూర్తి వివరా లు పక్షం రోజుల్లో ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశా రు. సంబంధిత అధికారులు వివరాలు ఇవ్వడానికి మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. గత నెలలోనే సీసీఐ కొనుగోళ్లు నిలిపివేయడంతో సంబంధిత వెబ్సైట్ సైతం మూతపడింది. వ్యవసాయ మార్కెట్లలో పత్తి కొనుగోళ్లు, రైతుల సంఖ్య, టీఆర్ జారీ, అందుకు సంబంధించిన కొనుగోళ్ల వివరా లు, కావాలని ఒకవేళ అవకతవకలు జరిగితే ఎక్క డో చెప్పాలని స్పష్టం చేశారు. వీరు పంపిన నివేదికతోపాటు, ఇదివరకే విజిలెన్స్ అధికారులు విచారణ అంశాలను బేరీజు వేసి, అక్రమాలని తేలిన చోట, తప్పుల తడకగా వివరాలు ఇచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారని తెలుస్తోంది.
పుస్తకాలు ఇవ్వడంలో మీనమేషాలు
టీఆర్ తాత్కాలిక పుస్తకాలు ఏవోల దగ్గరే ఉన్నాయి. మార్కెటింగ్ అధికారులకు వెంటనే తిరిగి ఇచ్చేయాల్సిన వ్యవసాయ అధికారులు ఇంకా వారి దగ్గరే ఉంచుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో 200–250 టీఆర్ పుస్తకాలను మార్కెట్ అధికారులు, వ్యవసాయ అధికారులకు ఇచ్చారు. ఒక అసలు ధ్రువీకరణ పత్రం రైతుకు జారీ చేయగా, మరొకటి నకలు తీసుకుంటారు. వీటిని మార్కెట్ అధికారులకు ఇవ్వాలి. జిల్లాలో ఏడువేల టీఆర్లు జారీ అయినట్లు తెలుస్తోంది. అసలు ఆవినీతి అంతా ఇక్కడే జరిగింది. కరీంనగర్, జమ్మికుంట, గంగాధర, చొప్పదండి, తదితర మార్కెట్లలో టీఆర్లు జారీ కాగా లోతుగా దర్యాప్తు సాగాల్సిన అవసరముంది.
పాత కథేనా.. తేలుస్తారా..!
ఉమ్మడి జిల్లా పరిధిలో 2004 నుంచి 2007 సంవత్సరాల మధ్య భారత పత్తి సంస్థ(సీసీఐ) కొనుగోలు కేంద్రాలు తెరచి పెద్ద మొత్తంలో పత్తి కొనుగోలు చేసింది. రైతులు మార్కెట్కు వెళ్లినప్పుడు ధరలు పెట్టకుండా.. నానా రకాల కొర్రీలతో కొనుగోళ్లు చేయని సీసీఐ ఏటా చివరలో రైతుల నుంచి భారీ మొత్తంలో కొనుగోలు చేసినట్లు ప్రకటనలు చేసింది. దీనిపై రైతులు, రైతు సంఘాలు, పలు స్వచ్ఛంద సంస్థలు ఆందోళనలు చేశాయి. సీసీఐ కేంద్రాల నిర్వాహకులు, జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు ఒకటై దోపిడీక పాల్పడ్డారని ఆరోపించాయి. దిగివచ్చిన ఉమ్మడి రాష్ట్రంలోని ప్రభుత్వం విజిలెన్స్, సీబీసీఐడి విచారణకు ఆదేశించింది. విచారణ నామమాత్రంగా సాగుతుండడం. సీసీఐ, జిన్నింగ్ మిల్లుల యజమానులకు అనుకూలంగా విజిలెన్స్, సీబీసీఐడీ అధికారులు వ్యవహరిస్తున్నారని గ్రహించిన కురుక్షేత్ర అనే స్వచ్ఛంద సంస్థ, రైతు సాధికారక సంస్థ సీబీఐతో విచారణ చేయించాలని హైకోర్టును ఆశ్రయించాయి. ఫలితంగా సీబీఐ ఆధికారులు రంగంలోకి దిగారు, ఆ మూడేళ్లలో సీసీఐ తెరిచిన కేంద్రాలు.. కొనుగోలు చేసిన పత్తి పరిమాణం.. ఏ కేంద్రాల్లో.. ఏఏ రైతుల నుంచి ఎంత మొత్తం కొనుగోలు చేశారు. ధరలు ఏ విధదంగా పెట్టారనే దానిపై దర్యాప్త ప్రారంభించారు. దర్యాప్తు తీరు చూసి న్యాయం జరుగుతుందని.. అక్రమాలు బట్టబయలవుతాయని అంతా ఆశించారు. కానీ దశాబ్దాలు గడిచినా విచారణ నామమాత్రమే. అక్రమాల్లో భాగస్వాములైనవారు ఉన్నత హోదాల్లో ఉండటం గమనార్హం.