
తండ్రిని హతమార్చిన తనయుడు
రాయికల్: రాయికల్ మండలం మైతాపూర్ గ్రామంలో తొట్ల ఎర్రయ్య(65)ను కన్న కొడుకే గొడ్డలితో దారుణంగా హతమార్చిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. ఎస్సై సుధీర్రావు కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైతాపూర్ గ్రామంలో తొట్ల ఎర్రయ్య కొడుకు మల్లేశ్తో కలిసి జీవిస్తున్నాడు. చిన్నప్పుడే తల్లి చనిపోగా.. మల్లేశ్ మానసిక పరిస్థితి సరిగా లేదు. కొడుకు ఆలన పాలన తండ్రి ఎర్రయ్య చూసుకుంటున్నాడు. మానసిక స్థితి సరిగా లేని మల్లేశ్ బుధవారం అర్ధరాత్రి తన తండ్రిపై గొడ్డలితో తీవ్రంగా దాడిచేయగా అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటన స్థలాన్ని జగిత్యాల రూరల్ సీఐ కృష్ణారెడ్డి సందర్శించారు. సంఘ నాయకుడు నాగుల గంగ మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.