
విత్తనానికి తొందర పడొద్దు
వీణవంక(హుజూరాబాద్)/కరీంనగర్రూరల్: ముందస్తు రుతుపవనాల రాకతో సంబరపడిన రైతన్నకు నిరాశే మిగిలింది. వానాకా లం సీజన్ ఆరంభంలో రోహిణికార్తె ప్రవేశించిన తొలిరోజునుంచి నాలుగైదు రోజులపాటు కురిసిన తొలకరి వర్షాలకు రైతులు సంబురపడ్డారు. జిల్లాలోని పలుచోట్ల దుక్కులు దున్ని పత్తి విత్తనాలు సైతం వేశారు. అయితే కొద్దిరోజులకే చినుకు కినుకు వహిస్తోంది. వారం రోజుల నుంచి వర్షం జాడ లేకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మండుతున్న ఎండలతో వేసిన విత్తనం ఎండిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని చోట్ల విత్తనాలు వేసేందుకు ఎదురుచూస్తున్న రైతులకు చినుకుజాడ లేకపోవడంతో అదను దాటిపోతోందని ఆవేదన చెందుతున్నారు. నేటినుంచి మృగశిర కార్తె ప్రవేశిస్తుండగా.. ఈ కార్తెలోనైనా వరణుడు కరుణిస్తాడా అని ఆశతో ఎదురుచూస్తున్నారు.
మృగశిరపైనే ఆశలు
వానాకాలం పంటల సాగును మృగశిర కార్తె నుంచి రైతులు ప్రారంభిస్తారు. ముందస్తు నైరుతి రుతుపవనాల రాకతో కొందరు రోహిణికార్తెలోనే పత్తి, మొక్కజొన్న విత్తనా లు వేశారు. పదిరోజుల నుంచి ఎండలు దంచికొడుతుండగా ఒక్క వర్షం పడలేదు. ఆదివారం నుంచి ప్రవేశిస్తున్న మృగశిర కార్తెలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయనే ఆశతో రైతులు ఎదురుచూస్తున్నారు. వాతావరణ శాఖ రాబోయే నాలుగురోజుల పాటు వర్షాలు కురుస్తాయనే సూచనతో విత్తనాలు మొ లకెత్తుతాయనే భరోసా కల్పించింది. వర్షాలు కురిసిన అనంతరమే విత్తనాలు వేయాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.
3,43,240 ఎకరాల సాగు అంచనా
జిల్లాలో ఈ వానాకాలంలో 3,43,240 ఎకరాలలో వివిధ పంటలు సాగులోకి వస్తాయని అధికారులు అంచనా వేశారు. వరి 2,76,500 ఎకరాలు, పత్తి 48వేల ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేస్తున్నారు. రోహిణి కార్తెలో ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 28వేల ఎకరాల్లో పత్తి విత్తినట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. వారం రోజులుగా ఎండలు దంచి కొడుతుండడంతో విత్తనాలు మాడిపోయే అవకాశముంది. భారీ వర్షాలు పడితే కానీ.. విత్తనాలు విత్తుకోవడం, నార్లు పోయడం చేయొద్దని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. కనీస వర్షపాతం నమోదయ్యాకే వరినాట్లు వేసుకోవాలని చెబుతున్నారు. కొందరు పోసిన నార్లు ఎండలతో దెబ్బతింటున్నాయి. మృగశిరలో మంచి వర్షాలు పడితే తప్పా వ్యవసాయంలో ముందుకు సాగొద్దని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు.
జిల్లాలో వానాకాలం సాగు అంచనా(ఎకరాల్లో)
వరి 2,76,500
పత్తి 48,000
మొక్కజొన్న 4,000
మిర్చి 1,000
కూరగాయలు, హర్టికల్చర్ 13,045
ఇతర పంటలు 695
ముఖం చాటేసిన నైరుతి రుతుపవనాలు
ఊరించి.. ఉసూరు మనింపించిన రోహిణికార్తె
నేటినుంచి మృగశిర ప్రారంభం
మండుతున్న ఎండలు.. మొలకెత్తని పత్తి విత్తనాలు
భారీ వర్షాలు పడితేనే విత్తనాలు వేయాలని సూచన