
రూ.31కోట్లతో రోడ్ల నిర్మాణం
● రాష్ట్రం ప్రతిపాదిస్తే ఎన్హెచ్ నిధులతో రాజీవ్ రహదారి విస్తరణ ● కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
కొత్తపల్లి(కరీంనగర్): కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం రోడ్ల నిర్మాణం, సదుపాయాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. జాతీయ ఉపాధిహామీ పథకం కింద రూ.31కోట్ల 12 లక్షలతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో అంతర్గత రోడ్ల నిర్మాణం జరుగుతోందని వెల్లడించారు. కొత్తపల్లి మండలం ఖాజీపూర్లో జాతీయ ఉపాధిహామీ పథకం కింద రూ.14 లక్షలతో నిర్మించిన రోడ్డును శనివారం ప్రారంభించారు. కొత్తపల్లి మండలంలోని ఆసిఫ్నగర్లో రూ.9.50 లక్షల ఎంపీ లాడ్స్ నిధులతో నిర్మించనున్న మార్కెట్షెడ్కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్తపల్లి మండలంలో రోడ్ల నిర్మాణం కోసం ఈ ఏడాది రూ.74 లక్షలు విడుదలైనట్లు తెలిపారు. ఖాజీపూర్లో జాతీయ ఉపాధి హామీ పథకం కింద రూ.14లక్షలతో రోడ్డు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కేంద్ర రహదారుల సదుపాయాల నిధి (సీఆర్ఐఎఫ్) కింద రూ.291 కోట్లు ఖర్చు చేసి 1341 కిలోమీటర్ల మేరకు రోడ్లను నిర్మించామని తెలిపారు. నేషనల్ హైవే నిధులతో రాజీవ్ రహదారిని విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. జాతీయ రహదారుల నిర్మాణానికి దాదాపు రూ.5వేల కోట్లు ఖర్చు చేశామని, కరీంనగర్ నుంచి వరంగల్, సిద్దిపేట నుంచి ఎల్కతుర్తి నేషనల్ హైవేల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని స్పష్టం చేశారు. త్వరలోనే కరీంనగర్– జగిత్యాల రోడ్డు పనులు ప్రారంభించబోతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులుపాల్గొన్నారు.