
పెళ్లికి వెళ్తూ.. మృత్యు ఒడికి
సాక్షి పెద్దపల్లి: పెళ్లి ఇంటికి చేరుకోవాల్సిన దంపతులను లారీ రూపంలో వచ్చిన మత్యువు కబళించింది. జీవితంలోనే కాదు... మరణంలోనూ తమ బంధం విడదీయరానిదంటూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. వృద్ధురాలిని తప్పించబోయి, దంపతుల బైక్ను లారీ ఢీకొట్టిన ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని సుగ్లంపల్లి వద్ద రాజీవ్ రహదారిపై గురువారం రాత్రి జరిగింది. ప్రమాదంలో దంపతులు మతిచెందగా, మూడేళ్లు కూతురు తీవ్రగాయల పాలైంది. ఈ సంఘటనకు సంబంధించి ఎస్సై శ్రావణకుమార్ తెలిపిన వివరాల ప్రకారం పెద్దపల్లి జిల్లా పాలకూర్తి మండలానికి చెందిన డ్రైవర్గా పనిచేస్తున్న గుంటిపల్లి రాము(30) భార్య అనూష(27), కూతురు సహాస్ర(03)లు కలిసి హూజూరాబాద్లోని బంధువుల పెళ్లికి వెళ్లాడానికి ద్విచక్రవాహనంపై బయల్దేరారు. ఈ క్రమంలో సుగ్లాంపల్లి వద్దకు రాగానే పెద్దపల్లి వైపు వెళ్తున్న లారీకి వృద్ధురాలు అడ్డుగా రావడంతో లారీ డ్రైవర్ ఆమెను తప్పించబోయాడు. దీంతో లారీ డివైడర్ ఎక్కి ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో భార్య అనూష అక్కడిక్కడే మృతిచెందగా, భర్త సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతిచెందాడు.. కూతురుకు తీవ్రగాయాలు కాగా మెరుగైన వైద్యం కోసం కరీంనగర్లోని ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. విషయం తెలుసుకున్న సీఐలు సుబ్బారెడ్డి, అనిల్లు అసుపత్రికి వచ్చి వివరాలను ఆడిగి తెలుసుకున్నారు.
బసంత్నగర్లో విషాదం
పాలకుర్తి: మరో రెండు రోజుల్లో బావమరిది వివాహం. ఎంతో సంబరంగా బయలుదేరిన భార్యాభర్తలు మార్గమధ్యంలో మృత్యువు కబలించడంతో బసంత్నగర్లో విషాదం నెలకొంది. తీవ్రంగా గాయపడ్డ చిన్నారి సహస్ర చావుబతుకులమధ్య వరంగల్ ఎంజీఎంలో పోరాడుతోంది. బసంత్నగర్లోని రాంనగర్కు చెందిన గుంటుపల్లి రాము స్థానికంగా లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. చిన్నప్పుడే తండ్రి కుమారస్వామి చనిపోగా, తల్లి పద్మ కాయాకష్టం చేసి కొడుకు రాము, బిడ్డ రమ్యను ఎంతో అల్లారుముద్దుగా పెంచింది. కొడుకు, కోడలు చనిపోయిన వార్త విన్న తల్లి పద్మ రోదనలు అక్కడున్నవారిని కంటతడిపెట్టించాయి.
● రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి
● వృద్ధురాలిని తప్పించబోయి దంపతులపైకి దూసుకెళ్లిన లారీ
● తీవ్ర గాయాలతో బయటపడిన మూడేళ్ల చిన్నారి