
విద్యార్థులూ.. సెల్ఫోన్లను పక్కన పెట్టండి
● సమ్మర్ క్యాంపును సద్వినియోగం చేసుకోండి ● జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్: కరీంనగర్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పలు అంశాలపై ఉచిత వేసవి శిక్షణ కార్యక్రమాన్ని 20 రోజులపాటు నిర్వహించనున్నామని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఈనెల 28 నుంచి ప్రారంభం కానున్న వేసవి శిక్షణ తరగతులపై శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రైవేట్ విద్యాసంస్థల కరస్పాండెంట్లు, ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. విద్యార్థులు చదువుతోపాటు వివిధ క్రీడల్లో చక్కగా రాణించాలని సూచించారు. వేసవి శిక్షణ శిబిరాలకు సంబంధించి పలు అంశాలపై వారికి దిశానిర్దేశం చేశారు. సోమవారం నుంచి కరీంనగర్లోని నాలుగు ప్రభుత్వ పాఠశాలలతోపాటు ఎంపిక చేసిన 10 ప్రైవేటు పాఠశాలల్లో 20 అంశాలపై ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్లోని బాలభవన్, అంబేడ్కర్ స్టేడియం, సప్తగిరికాలనీలోని కేజీబీవీ స్కూల్, మంకమ్మతోటలోని గర్ల్స్ హైస్కూల్తోపాటు ఎంపిక చేసిన పది ప్రైవేటు పాఠశాలల్లో సమ్మర్ క్యాంపులు జరుగుతాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సమ్మర్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని, సెల్ఫోన్లకు దూరంగా ఉండాలని, వాటి బారిన పడి ఇబ్బందులు తెచ్చుకోవద్దని సూచించారు. స్విమ్మింగ్, స్పెల్ బి, క్రియేటివ్ రైటింగ్, అబాకస్, వాలీబాల్, బుక్ రివ్యూ, యాక్టింగ్, పెయింటింగు, క్విజ్, డ్యాన్సు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, చెస్, బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అండ్ ఫొటోషాప్, వివిధ అంశాలపై విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. డీఆర్వో వెంకటేశ్వర్లు, డీఈవో జనార్దన్రావు, క్వాలిటీ కోఆర్డినేటర్ కర్ర అశోక్రెడ్డి, ప్రైవేట్ విద్యాసంస్థల ప్రతినిధులు శేఖర్రావు, రామారావు, హనుమంతరావు, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.