రైల్వే మంత్రిని కలిసిన ఎమ్మెల్యే కేవీఆర్
కామారెడ్డి టౌన్: కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి బుధవారం ఢిల్లీలో కలిశారు. జిల్లా కేంద్రంలో రైల్వే బ్రిడ్జి, అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని వినతిపత్రం అందించారు. పట్టణంలో ట్రాఫిక్ రద్దీ తీవ్రమైనందున బ్రిడ్జీల నిర్మాణాలకు సహకరించాలని కోరానని ఎమ్మెల్యే తెలిపారు. స్నేహపురి కాలనీ నుంచి కలెక్టర్ ఆఫీస్ రోడ్ వరకు, వికాస్ నగర్ కాలనీ నుంచి ఇస్లాంపురా వరకు, పాత రాజంపేట రైల్వే గేట్ వద్ద, ప్రియ టాకీస్ రోడ్డు నుంచి ఇందిరా చౌక్ వరకు, రోడ్ ఓవర్ బిడ్జ్రి(ఆర్వోబీ)ల నిర్మాణం కోసం నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశానన్నారు. మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు.
కామారెడ్డి అర్బన్: విదేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్య అభ్యసించడానికి బీసీ, ఇతర విద్యార్థులకు అవసరమైన శిక్షణ ఇవ్వనున్నట్లు నిజామాబాద్ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ వెంకన్న ఒక ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ స్కాలర్షిప్లు పొందడానికి వీలుగా అవగాహన, శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. ఆసక్తిగల వారు ఈనెల 21వ తేదీ వరకు టీజీ బీసీ స్టడీ సర్కిల్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, ఇతర వివరాలకు 08462–241055 నంబర్లో సంప్రదించాలని సూచించారు.
పెద్దకొడప్గల్: జొన్న పంటను మొగి పురుగు ఆశించడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. మండలంలో 9,600ల ఎకరాలలో జొన్న పంట సాగవుతోంది. పంట మొలక దశ నుంచి మొగి పురుగు, పచ్చ పురుగు బెడద ఎక్కువగా ఉందని రైతులు తెలిపారు. పురుగుల నివారణకు మందులు పిచికారి చేస్తున్నా ఫలితం ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, పంటలను పరిశీలించి నివారణ చర్యలు సూచించాలని కోరుతున్నారు.
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల విద్యార్థులు ఎం.ఉదయ్కిరణ్, అబ్దుల్ సమీర్ తెలంగాణ విశ్వవిద్యాలయం వాలీబాల్ క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ చూపి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 12 నుంచి ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో నిర్వహించే జాతీయ స్థాయి వాలీబాల్ పోటీల్లో వీరు రాష్ట్ర జట్టు తరఫున పాల్గొంటారని కళాశాల ఇన్చార్జి పీడీ జి.శ్రీనివాస్రావు తెలిపారు. ఉదయ్కిరణ్, అబ్దుల్ సమీర్లను ప్రిన్సిపల్ విజయ్కుమార్, వైస్ ప్రిన్సిపల్ కిష్టయ్య, అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు.
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంటర్నల్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. రిజిస్ట్రార్ ఎం యాదగిరితో కలిసి వర్సిటీ వైస్చాన్స్లర్ టి యాదగిరిరావు ఎగ్జామినేషన్ సెంటర్ను తనిఖీ చేశారు. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని ప్రిన్సిపాల్ సీహెచ్ ఆరతికి సూచించారు. అనంతరం ఇంజినీరింగ్ విద్యార్థులతో కలిసి వీసీ, రిజిస్ట్రార్లు గ్రూప్ ఫొటో దిగారు. కార్యక్రమంలో పరీక్షల నియంత్రణ అధికారి కే సంపత్ కుమార్, అధ్యాపకులు నందిని, అతిక్ సుల్తాన్ ఘోరీ, భ్రమరాంబిక, నీలిమ, పార్ట్ టైం లెక్చరర్లు వినాయక్, సంతోష్రెడ్డి, గణేశ్, నితిన్ తదితరులు పాల్గొన్నారు.
రైల్వే మంత్రిని కలిసిన ఎమ్మెల్యే కేవీఆర్
రైల్వే మంత్రిని కలిసిన ఎమ్మెల్యే కేవీఆర్


