కదిలిన రథం..వెలిగిన అగ్నిగుండం
రామారెడ్డి: ప్రముఖ పుణ్యక్షేత్రం ఇసన్నపల్లి (రామారెడ్డి) కాలభైరవుడి జన్మదిన వేడుకలు గురువారం నిర్వహించిన రథోత్సవం, అగ్నిగుండాలతో(దక్షయజ్ఞం) ముగిశాయి. గురువారం తెల్లవారుజామున 3 గంటల నుంచి ప్రారంభమైన రథోత్సవం ఇసన్నపల్లి, రామారెడ్డి గ్రామాలలో కొనసాగింది. యువకులు రథాన్ని లాగడానికి భారీగా తరలివచ్చారు. కాలభైరవుని నామస్మరణతో రెండు గ్రామాలు మారుమోగాయి. మహిళలు మంగళహారతులతో కాలభైరవుడికి స్వాగతం పలికి కానుకలు సమర్పించారు. రథం ఆలయ ప్రాంగణానికి చేరుకోగానే వేడుకల్లో ముఖ్యమైన అగ్ని గుండాలను (దక్షయజ్ఞం) వీరశైవ మహేశ్వరులు ప్రారంభించారు. అగ్నిగుండాలు ముగిసిన అనంతరం ఆలయంలో దండకాలు వేశారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పోలీసులు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు దాతల సాయంతో అన్నదానం ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో ప్రభుగుప్తా తెలిపారు. స్వామివారి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి ఇప్పటికే రూ.80 లక్షలు మంజూరు చేయించానని, రానున్న కాలంలో రూ.10 కోట్లతో అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. తాను రామారెడ్డి గ్రామంలో పుట్టి పెరిగానని తన చిన్న తనంలో కాలభైరవుడి కొబ్బరి కాయల ప్రసాదం తిని కాలభైరవుడి ఆశ్వీర్వాదంతోనే ఈ స్థాయికి వచ్చనని అన్నారు.
వైభవంగా కొనసాగిన రథోత్సవం
అగ్నిగుండాలకు తరలివచ్చిన భక్తులు
ముగిసిన కాలభైరవుడి
జన్మదిన వేడుకలు
రూ.10కోట్లతో ఆలయాన్ని
అభివృద్ధి చేస్తానన్న ఎమ్మెల్యే
కదిలిన రథం..వెలిగిన అగ్నిగుండం
కదిలిన రథం..వెలిగిన అగ్నిగుండం


