
ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం వద్దు
కామారెడ్డి క్రైం: ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయవద్దని, వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. జిల్లాకేంద్రం శివారులోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 86 ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో కలెక్టర్తోపాటు వివిధ శాఖల అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. భూ సమస్యలు, ఇళ్ల మంజూరు, రైతు భరోసా, పింఛన్లకు సంబంధించిన ఫిర్యాదులే ఎక్కువగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు 409 ప్రజావాణి ఫిర్యాదులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. వాటిని త్వరగా పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీఓ వీణ, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
దోమకొండలో..
దోమకొండ: మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ఈసందర్భంగా ఎంపీడీవో ప్రవీన్కుమార్ మాట్లాడుతూ.. ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. డిప్యూటీ తహసీల్దార్ రేఖ, ఐకేపీ ఏపీవో రాజు, ఈజీఎస్ ఏపీఏం రజని, ఏవో మణిదీపిక తదితరులు పాల్గొన్నారు.
నిరుద్యోగుల ఉపాధికి గండి కొడుతున్నారు..
జిల్లాలోని ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న కొంతమంది అధికారులు నిబంధనలకు విరుద్దంగా తమ సొంత వాహనాలను ప్రభుత్వ విధులకు నడిపిస్తూ నిరుద్యోగుల ఉపాధికి గండి కొడుతున్నారని హైర్ వెహికల్స్ అసోసియేషన్ జిల్లా శాఖ ప్రతినిధులు ఆరోపించారు. జిల్లా అధ్యక్షుడు రాజాగౌడ్ మాట్లాడుతూ.. 48 ప్రభుత్వ శాఖల్లో ఒక్కోశాఖకు కనీసం 5 అద్దె వాహనాలు అవసరం ఉంటాయన్నారు. వాటిని నిరుద్యోగులైన వాహనదారుల నుంచి అద్దెకు తీసుకుని నడిపించుకోవాల్సి ఉంటుందన్నారు. కానీ అధికారులు తమ సొంత వాహనాలను నడిపిస్తూ అడ్డదారిలో బిల్లులు చేయించుకుంటున్నారన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం నడిపిస్తున్న అద్దె వాహనాలకు సంబంధించిన 15 నెలల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని వాపోయారు. ఇప్పటికై నా సమస్యను పరిష్కరించాలని ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు.
విద్యుత్, మంచినీటి సౌకర్యం కల్పించాలి..
భిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామంలో గతంలో ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాల్లో నివాసాలు వేసుకున్న వారికి విద్యుత్, మంచినీటి సౌకర్యాలను కల్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం సీపీఎం ఆధ్వర్యంలో కాలనీవాసులు సోమవారం కలెక్టరేట్కు తరలివచ్చారు. 2008లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చిందన్నారు. ఆ స్థలాలను కాజేయాలనే ఉద్దేశంతో కొందరు అధికారులను బెదిరిస్తూ కాలనీకి మంచినీరు, విద్యుత్ సౌకర్యాలు రాకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి కాలనీకి తగిన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. సీపీఎం నాయకకులు దేవరాజ్, నర్సింలు, నారాయణ, లక్ష్మీ, రమణ, శ్యామల తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
ప్రజావాణికి 86 ఫిర్యాదులు

ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం వద్దు

ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం వద్దు