
రామడుగు ప్రాజెక్టులో పడి యువకుడి మృతి
ధర్పల్లి: మండలంలోని రామడుగు ప్రాజెక్ట్లో స్నానానికి వెళ్లి ఊపిరాడక ఒక యువకుడు మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. సిరికొండ గ్రామానికి చెందిన రాజశేఖర్ గౌడ్ (28) స్నేహితులతో కలిసి చేపలు పట్టేందుకు బుధవారం మధ్యాహ్నం రామడుగు ప్రాజెక్టు వద్దకు వెళ్లారు. మొదట స్నానం చేయడానికి రాజశేఖర్ గౌడ్ నీటిలో దూకాడు. ప్రాజెక్టు లోతు ఎక్కువగా ఉండటంతో బయటకు రాలేదు. స్నేహితులు, స్థానికుల సహాయంతో రాజశేఖర్ గౌడ్ను బయటకు తీసుకురాగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి తల్లి అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.
సాటాపూర్లో కార్డన్ సెర్చ్
రెంజల్(బోధన్): మండలంలోని సాటాపూర్ గ్రామంలో బుధవారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సీపీ ఆదేశాల మేరకు బోధన్ ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం చేపట్టారు. నాలుగు ఆటోలు, 80 ద్విచక్ర వాహనాలకు ధ్రువపత్రాలు లేకపోవడంతో సీజ్ చేసి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా ధ్రువపత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మోటారు వాహన నిబంధనలు పాటించాలని సూచించారు. లేనిపక్షంలో జరిమానాలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఓ ఇంట్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారనే సమాచారంతో తనిఖీ చేసి 45 క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో బోధన్ రూరల్ సీఐ విజయ్బాబు, ఎస్సై చంద్రమోహన్తోపాటు సిబ్బంది పాల్గొన్నారు.
బైక్ల చోరీ
ఖలీల్వాడి: నగరంలోని నాల్గో టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో వేర్వేరు చోట్ల ఇంటి ఎదుట పార్క్ చేసిన రెండు బైక్లను దొంగలు ఎత్తుకెళ్లినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. నగరంలోని షిర్డీ సాయికృపానగర్ కాలనీలో సాదుల్లా శేఖర్ ఇంటి ఎదుట పార్క్ చేసిన బైక్ను దొంగలు ఎత్తుకెళ్లినట్లు ఫిర్యాదు చే శారు. బోర్గాం సమీపంలోని శ్రామిక్నగర్లో రాము లు ఇంటి ఎదుట బైక్ను పార్కింగ్ చేయగా గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

రామడుగు ప్రాజెక్టులో పడి యువకుడి మృతి