
‘గణన’ నిర్ణయం బీసీ సంఘాల విజయం
కామారెడ్డి అర్బన్: జనాభా లెక్కలతోపాటు సమగ్ర కులగణన చేపడతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం బీసీ సంఘాల ఉద్యమాల విజయమని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సాప శివరాములు అన్నారు. పట్టణంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నరేంద్రమోదీ ప్రభుత్వానికి బీసీ సంఘాలు ధన్యవాదాలు తెలుపుతున్నాయన్నారు. బీసీల జనాభా ప్రకారం జాతీయ, రాష్ట్రస్థాయిలో ఉద్యోగాలు, రాజకీయ పదవులు, చట్టసభల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని, అంతవరకు ఉద్యమాలు కొనసాగుతాయన్నారు. సమావేశంలో నాయకులు నీల నాగరాజు, ఐరేని సందీప్, నాగరాజుగౌడ్, మోహనచారి, సాయాగౌడ్, రవికుమార్, వడ్ల సురేశ్, దయాకర్, జే నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.