
భూ సమస్యల పరిష్కారానికే భూ భారతి
రాజంపేట/తాడ్వాయి/కామారెడ్డి రూరల్ : భూసమస్యల పరిష్కారం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూ భారతిని తీసుకొచ్చిందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. రాజంపేట, తాడ్వాయి మండల కేంద్రాలతోపాటు కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి రైతు వేదికల్లో బుధవారం నిర్వహించిన భూ భారతి అవగాహన సదస్సుల్లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ధరణికి బదులు తీసుకొచ్చిందని భూ భారతితో ప్రతి ఒక్క రైతుకూ మేలు జరుగుతుందన్నారు. సెక్షన్ నాలుగు ప్రకారం హక్కుల రికార్డులో తప్పుల సవరణకు, భూమి హక్కులు ఉండి రికార్డుల్లో పేర్లు లేని వారికి హక్కుల రికార్డులో పేరును నమోదు చేసుకోవడానికి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.సెక్షన్ ఐదు ప్రకారం వ్యవసాయభూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేసుకోచ్చని తెలిపారు. 2014 జూన్ 2కు ముందు సాదాబైనామా ద్వారా భూమి కొనుగోలు చేసి క్రమబద్ధీకరణకోసం అందిన దరఖాస్తులపై ఆర్డీవోల ద్వారా విచారణ చేపట్టి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందన్నారు. ఆధార్ కార్డుల మాదిరిగా రైతులకు భూధార్ కార్డులను జారీ చేస్తామని తెలిపారు. గతంలో ధరణీలో అప్పీలు కు ఆస్కారం లేనందున సివిల్ కోర్టుకు వెళ్ళవలసి ఉండేదని, ప్రస్తుతం తహసీల్దార్ ఇచ్చిన తీర్పులో అభ్యంతరం ఉంటే ఆర్డీఓ కు, ఆర్డీఓ తీర్పులో అభ్యంతరం ఉంటే కలెక్టర్ కు అప్పీలు. చేసుకోవచ్చని, కలెక్టర్ ఇచ్చిన తీర్పు అభ్యంతరం ఉంటే భూమి ట్రిబ్యునల్ కు అప్పీలు చేసుకునే ఆస్కారం ఉంటుందని తెలిపారు. ఆర్డీవో వీణ మాట్లాడుతూ.. ధరణిలో 33 మాడ్యూల్స్ ఉండేవని, భూభారతి చట్టంలో కేవలం 6 మాడ్యూల్స్లతో భూ సంబంధిత సమస్యల పరిష్కారానికి వీలవుతుందన్నారు. మాజీ వైస్ ఎంపీపీ నర్సింలు మాట్లాడుతూ.. మండలంలో ఇనాం భూములు కలిగిన రైతులకు పట్టా పాస్పుస్తకాలు ఇవ్వాలని కలెక్టర్ను కోరారు. కార్యక్రమంలో మండలాల ప్రత్యేకాధికారులు రాజారాం, అపర్ణ, తహసీల్దార్లు రహీమొద్దీన్, సతీశ్రెడ్డి, ఎంపీడీవోలు సయ్యద్ సాజీద్అలీ, రఘురాం, సింగిల్విండో చైర్మన్లు నల్లవెల్లి అశోక్, కంది శివరాములు, కపిల్రెడ్డి పాల్గొనగా, చిన్నమల్లారెడ్డిలో నిర్వహించిన సదస్సులో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ధర్మగోని లక్ష్మీరాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా
పోర్టల్ తీసుకువచ్చింది
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్,
మ్యుటేషన్ చేసుకోవచ్చు
అవగాహన సదస్సులో
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్