
కేసులు పెండింగ్లో లేకుండా చూడాలి
కామారెడ్డి క్రైం: కేసులు పెండింగ్లో లేకుండా చూసుకోవాలని ఎస్పీ రాజేశ్ చంద్ర పోలీస్ అధికారులకు సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసుల పరిశోధన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసుల్లో నాణ్యమైన విచారణ చేపట్టి బాధితులకు అండగా నిలవాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను ఆక్సిడెంట్ ప్రోన్ ఏరియాగా గుర్తించాలన్నారు. అక్కడ సూచికల బోర్డులను ఏర్పాటు చేయించాలని సూచించారు. వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలను క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. తప్పుడు నంబర్ ప్లేట్ వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. నేరాల నియంత్రణతో పాటు, జరిగిన నేరాలను ఛేదించడంలో ఎంతగానో ఉపయోగపడే సీసీ కెమెరాల ప్రాధాన్యతను ప్రజలకు వివరించాలన్నారు. స్వచ్ఛందంగా ముందుకువచ్చి ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రస్తుత కాలంలో వెలుగుచూస్తున్న వివిధ రకాల ఆన్లైన్ మోసాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, కామారెడ్డి ఏఎిస్పీ చైతన్యరెడ్డి, డీఎస్పీలు శ్రీనివాస్రావు, సత్యనారాయణ, ఎస్బీ సీఐ జార్జ్, డీసీఆర్బీ సీఐ మురళి, జిల్లాలోని అన్ని ఠాణాల సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
రెగ్యులర్గా తనిఖీలు నిర్వహించండి
నేర సమీక్షలో ఎస్పీ రాజేశ్ చంద్ర