రోడ్డుపై పడిన రియాక్టర్
ఫ జనం లేని సమయంలో ఘటన
ఫ కెమికల్స్ లేకపోవడంతో తప్పిన ముప్పు
తుని: అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలంలోని డెక్కన్ కెమికల్ పరిశ్రమకు చెందిన రెండు రియాక్టర్లను ట్రాలీపై తరలిస్తుండగా ఒకటి రోడ్డుపై జారిపడిన సంఘటన శనివారం తుని రాజా రాజబాబు మున్సిపల్ పార్కు సెంటర్లో చోటు చేసుకుంది. మధ్యాహ్నం కావడంతో వాహన రాకపోకలు లేని సమయంలో జరగడం వల్ల ప్రమాదం తప్పిందని లేకపోతే విషాదం జరిగేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న తుని పట్టణ ఎస్సై పాపారావు సంఘటన స్థలానికి చేరుకుని రియాక్టర్ను రోడ్డుపై నుంచి జేసీబీ సహాయంతో తొలగించి ట్రాలీపైకి ఎక్కించారు. మందుల తయారీకి రియాక్టర్లను వినియోగిస్తుంటారు. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే పేలిపోయే ప్రమాదం ఉంది. డెక్కన్ కెమికల్స్ పరిశ్రమలో వినియోగించిన ఖాళీ రియాక్టర్లను వేరే ప్రాంతానికి తరలిస్తున్న సమయంలో జరగడం వల్ల పెను ప్రమాదం తప్పింది. కెమికల్స్ ఉంటే రియాక్టర్ పేలిపోయే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు. ఇలాంటివి తరలించేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని, ఇప్పుడు ఇందుకు భిన్నంగా ట్రాలీ డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ప్రమాదం జరిగిందని ఎస్సై పాపారావు తెలిపారు.


