గ్రామీణ ఆవిష్కరణలేప్రగతికి మూలం
తుని: గ్రామీణ ఆవిష్కరణలే దేశ ప్రగతికి మూలం అని అగ్రిలైఫ్ సీఈఓ డాక్టర్ వెంకటేష్ దేవనార్ అన్నారు. శనివారం స్థానిక శ్రీప్రకాష్ స్పేసెస్ డిగ్రీ కళాశాలలో సైక్వస్ట్ 2026 జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించారు. తొలుత ముఖ్య అతిథి వెంకటేష్ దేవనార్కు విద్యాసంస్థల సంయుక్త కార్యదర్శి సీహెచ్ విజయ్ప్రకాష్ స్వాగతం పలికారు. విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులను ఆయన పరిశీలించారు. విద్యార్థులు సృజనాత్మకతతో కూడిన ఆవిష్కరణలకు ముందుకు రావాలని, శ్రీప్రకాష్ విద్యా సంస్థ రెండు రోజుల పాటు జాతీయ వర్క్షాప్ నిర్వహించడం అభినందనీయమని దేవనార్ అన్నారు. విద్యార్థులు తమ ఆలోచనలకు పదును పెట్టినప్పుడే అన్నింటా సఫలీకృతులు అవుతారన్నారు.
గౌరవ అతిథి పల్లె సృజన కో ఆర్డినేటర్ బి.సుభాష్ చందర్ మాట్లాడుతూ కొత్త ఆవిష్కరణల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు. ముఖ్య అతిథులను విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కంటిపూడి నరేంద్రబాబు, విద్యాసంస్థల అధినేత సీహెచ్వీకే నరసింహారావులు సత్కరించారు. ఈ సైన్స్ వేడుకులకు కాకినాడ, అనకాపల్లి జిల్లాలకు చెందిన విద్యార్థులు హాజరయ్యారు. క్విజ్ పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. శ్రీప్రకాష్ విద్యాసంస్థల ప్రిన్సిపాల్ ఎ.రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


