నాక్ ఆధ్వర్యంలో సర్వేపై ఉచిత శిక్షణ
సామర్లకోట: స్థానిక సీబీఎం సెంటర్లో ఉన్న నేషనల్ అకాడమి ఆఫ్ కనస్ట్రక్షన్ (నాక్) ఆధ్వర్యంలో నిరుదోగ్య యువతీ, యువకులు మూడు నెలల పాటు సర్వేయింగ్ కోర్సుపై ఉచిత శిక్షణ ఇస్తామని సెంటర్ కోర్సు కోఆర్డినేటర్ ఆర్ఎన్ఎస్ఎస్ శివ, సెంటర్ ఇన్చార్జి ఎన్.తాతారావు తెలిపారు. శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ 18 నుంచి 45 సంవత్సరాల లోపు వయస్సు కలిగి 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లమా, ఐటీసీ, బీటెక్ అర్హత ఉన్నవారు శిక్షణకు హాజరు కావచ్చునని తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి కేంద్ర ప్రభుత్వ సర్టిఫికెట్తో పాటు ఉదోగ్య అవకాశం కల్పిస్తారన్నారు. ఈ నెల 25వ తేదీలోపు అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేయించుకోవాలని 28 నుంచి క్లాసులు ప్రారంభం అవుతాయని చెప్పారు. ఆసక్తి కలిగిన వారు 94407 56250, 96667 71726 నంబర్లలో సంప్రదించాలన్నారు.
తపోవనాన్ని సందర్శించిన
శారదా పీఠాధిపతి
తుని రూరల్: తుని మండలం కుమ్మరిలోవ తాండవ నదీతీరంలో ఉన్న సచ్చిదానంద తపోవనం ఆశ్రమాన్ని విశాఖపట్నానికి చెందిన శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి శనివారం సందర్శించారు. ఇటీవల శివైక్యం చెందిన తపోవనం పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతీ మహాస్వామి సమాధి వద్ద నివాళులర్పించారు. వేద విద్యార్థులను, వేద పండితులను కలుసుకుని సరస్వతీ మహాస్వామి నిర్వహించిన ఆథ్యాత్మిక కార్యక్రమాలను తెలుసుకున్నారు. శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి, విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి, భక్తులు పాల్గొన్నారు.
అందుబాటులోకి
హెలికాప్టర్ సేవలు
కాకినాడ రూరల్: కాకినాడ నగర వాసులు, జిల్లా వాసులు, బీచ్ సందర్శకుల గగన విహారానికి హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో స్మార్ట్ సిటీ నిధులు సుమారు రూ.3.5 కోట్లతో బీచ్ రోడ్డులో హెలిపోర్ట్ను అభివృద్ధి చేశారు. 2023 నవంబర్లో పనులకు మాజీ మంత్రి, అప్పటి ఎమ్మెల్యే కురసాల కురసాల కన్నబాబు ప్రారంభోత్సవం చేశారు. ఇప్పటికే గో కార్ట్ స్పోర్ట్స్ అందుబాటులో ఉండగా తాజా హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రైవేట్ నిర్వాహకుల ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ సేవలను రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ శనివారం ప్రారంభించారు. నిర్వాహకులు మాట్లాడుతూ 5 నుంచి 7 నిమిషాల పాటు గగన విహారం ఉంటుందని, ఇందుకు రూ.3,999 వసూలు చేస్తామన్నారు. ఏ స్క్వేర్ గో కార్ట్ డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చన్నారు. వారంలో మూడు రోజుల పాటు హెలికాప్టర్ ద్వారా ఏరియల్ వ్యూకు అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు.
లిఫ్ట్లో చిక్కుకున్న రోగులు
కాకినాడ క్రైం: కాకినాడ జీజీహెచ్లో రోగులు వారి బంధువులు లిఫ్ట్లో చిక్కుకోవడం ఆందోళన కలిగించింది. శనివారం సాయంత్రం 8 మంది మెడికల్ వార్డులో ఉన్న లిఫ్ట్లో చిక్కుకున్నారు. మొదటి, రెండవ అంతస్తుల మధ్య ఒక్కసారిగా ఆగిపోవడంతో ఎక్కిన వారిలో కంగారు మొదలైంది. ఈ విషయాన్ని గమనించిన సెక్యూరిటీ సూపర్వైజర్ లిఫ్ట్ ఆపరేటర్కి సమాచారం ఇవ్వడంతో టెక్నీషియన్లు వచ్చి అందులో ఉన్న వారిని సురక్షితంగా బయటకి తీసుకొచ్చారు. జీజీహెచ్లో ఈ లిఫ్ట్ చుట్టూ వివాదాలు అలముకున్నాయి. తరచుగా మొరాయిస్తూ లిఫ్ట్ కొన్ని నెలల పాటు పనిచేసేది కాదు. అధికారులు చేపట్టిన చర్యలన్నీ అంతంత మాత్రంగానే ఉండేవి. తాత్కాలికంగా పనిచేసినా మళ్లీ మొరాయింపు మామూలే. ఇలా గతంలోనూ లిఫ్ట్లో రోగులు చిక్కుకున్న సందర్భాలు ఉన్నాయి. శాశ్వత పరిష్కారం చూపకుండా జీజీహెచ్ అధికారులు, ఏపీఎంఎస్ఐడీసీ అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నాక్ ఆధ్వర్యంలో సర్వేపై ఉచిత శిక్షణ


