రత్నగిరి కిటకిట
అన్నవరం: రత్నగిరి సత్యదేవుని ఆలయం శనివారం వేలాదిగా విచ్చేసిన భక్తులతో కిటకిట లాడింది. రత్నగిరిపై శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో వివాహాలు చేసుకున్న నవ దంపతులు కూడా వారి బంధుమిత్రులతో కలసి సత్యదేవుని ఆలయానికి వచ్చారు. దీంతో ఆలయం నవ దంపతులు, వారి బంధుమిత్రులతో బాటు పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులతో స్వామివారి ఆలయం, ఆలయ ప్రాంగణం, విశ్రాంతి మండపాలు, క్యూ లు నిండిపోయాయి. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించారు. సత్యదేవుని దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఉదయం పది గంటలకు స్వామి, అమ్మవార్లను తిరుచ్చి వాహనంపై ఊరేగింపుగా తూర్పురాజగోపురం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ పండితుల పూజల అనంతరం దేవస్థానం ఏఈఓ కృష్ణారావు కొబ్బరికాయ కొట్టి సేవ ప్రారంభించారు. స్వామి, అమ్మవార్లను తిరుచ్చి వాహనం మీద మూడు సార్లు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయించారు. అనంతరం మళ్లీ పూజలు చేసి స్వామి, అమ్మవార్లను తిరిగి ప్రధానాలయానికి చేర్చారు.


