కాల్మనీ బాధితులకు అండగా ఉంటాం
● ఆ మాఫియాను తరిమికొడదాం
● ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు
అమలాపురం టౌన్: కాల్ మనీ వ్యాపారులు ఓ మాఫియా తయారై, అధిక వడ్డీలతో పేదల జీవితాలను నాశనం చేస్తున్నారని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవస్థను రద్దు చేయాలని తాము శాసన మండలిలో పోరాటం చేస్తున్నామని స్పష్టం చేశారు. అమలాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో కొందరు కాల్ మనీ బాధితులతో కలిసి శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో సుమారు 30 వేల మందికి పైగా పేదలు.. కాల్ మనీ వ్యాపారుల బారిన పడి విలవిలలాడుతున్నారన్నారు. ఉప్పాడ సత్యనారాయణ అనే చిన్న వ్యాపారి రూ.2 లక్షల అప్పు తీసుకుంటే.. దానిపై అధిక వడ్డీలు వేసి నేటికి రూ.17 లక్షలు వసూలు చేసేందుకు ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. పుస్తకాలు కుట్టుకుంటూ జీవించే సత్యనారాయణ ఇంటిపై కాల్ మనీ వ్యాపారి కన్ను పడిందన్నారు. దీంతో బాధితుడితో కలిసి తాను ఇటీవల జిల్లా ఎస్పీ రాహుల్ మీనాకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అమలాపురం పట్టణ సీఐ వీరబాబు ఆ కేసును దర్యాప్తు చేస్తున్నారని, సంబంధిత కాల్ మనీ వ్యాపారి కూడా దారికి వచ్చారని గుర్తు చేశారు. బాధితుల ఆస్తులపై కాల్ మనీ వ్యాపారులు సివిల్ దావాల ద్వారా పెడుతున్న కేసులను బాధితుల తరఫున ఎదుర్కొనేందుకు, పోరాడేందుకు మేమంతా మీకు అండగా ఉంటామని ఎమ్మెల్సీ తెలిపారు.


