
వ్యక్తి అనుమానాస్పద మృతి
తుని: స్థానిక జాతీయ రహదారి కొండవారిపేట ప్రాంతంలో ఉన్న చర్చి ఎదురుగా ఉన్న పొదల్లో వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్టు తుని పట్టణ సీఐ గీతా రామకృష్ణ తెలిపారు. బుధవారం అందిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకుని ఆయన తెలిపిన వివరాల మేరకు పిఠాపురం రూరల్ మండలం కోలంక గ్రామానికి చెందిన నంద్యాల వీరభద్రరావు (40)గా మృతుడిని గుర్తించారు. ప్రస్తుతం వీరభద్రరావు కుటుంబ సభ్యులను విచారిస్తున్నామన్నారు. ప్రమాదమా, లేదా హత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేస్తున్నామని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామన్నారు.
చోరీ కేసు దర్యాప్తు ముమ్మరం
ప్రత్తిపాడు: ప్రత్తిపాడులో పట్టపగలు జరిగిన చోరీపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక జాతీయ రహదారిపై నరేంద్రగిరి ఎదురుగా ఉన్న భవనంలో పట్టపగలే చోరీ జరిగిన సంగతి తెలిసిందే. పోలీసులు ప్రాధమికంగా 2.1 కేజీల వెండి, మూడు బంగారు గొలుసులు అపహరణకు గురైనట్టు భావించారు. అయితే ఇంటి యజమాని కంటిపూడి శివానంద భాస్కరరావు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్ టీమ్ వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యింది. సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. దీని ఆదారంగా ముగ్గురు వ్యక్తులు చోరీకి పాల్పడినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ప్రత్తిపాడు ఎస్సై ఎస్.లక్ష్మీకాంతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వ్యక్తి అనుమానాస్పద మృతి