పారిశుధ్య నిర్వహణకు రీ టెండర్లు | - | Sakshi
Sakshi News home page

పారిశుధ్య నిర్వహణకు రీ టెండర్లు

Jun 14 2025 7:37 AM | Updated on Jun 14 2025 7:37 AM

పారిశుధ్య నిర్వహణకు రీ టెండర్లు

పారిశుధ్య నిర్వహణకు రీ టెండర్లు

దేవదాయ శాఖ నోటిఫికేషన్‌

దాఖలుకు 26 వరకూ గడువు

వచ్చే నెల మొదటి వారంలో

ఖరారయ్యే చాన్స్‌

అన్నవరం: సత్యదేవుని సన్నిధి సహా రాష్ట్రంలోని ఏడు ప్రముఖ దేవస్థానాల్లో పారిశుధ్య నిర్వహణకు దేవదాయ శాఖ సెంట్రలైజ్డ్‌ ఈ–ప్రొక్యూర్‌ రీ టెండర్‌ నోటిఫికేషన్‌ను శుక్రవారం విడుదల చేసింది. శానిటరీ మెటీరియల్‌ సహా పారిశుధ్య పనులు, వివిధ సత్రాల్లో హౌస్‌ కీపింగ్‌, రోడ్లు, టాయిలెట్స్‌ క్లీనింగ్‌, ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌, ఏసీలు, ఇతర విద్యుత్‌ ఉపకరణాల నిర్వహణ తదితర పనుల నిర్వహణకు ఈ టెండర్‌ పిలిచారు. గత ఏప్రిల్‌లో పిలిచిన టెండర్‌ నోటిఫికేషన్‌పై టెండర్‌దారులు అనేక సందేహాలు వ్యక్తం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం దానిని రద్దు చేసింది. కొన్ని మార్పులతో తాజాగా కొత్త నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కొటేషన్ల దాఖలుకు జూన్‌ 26 చివరి తేదీగా నిర్ణయించారు. అన్నీ సవ్యంగా జరిగితే వచ్చే నెల మొదటి వారంలో టెండర్లు ఖరారు చేస్తారు. కాంట్రాక్ట్‌ దక్కించుకున్న సంస్థ అన్నవరం, సింహాచలం, శ్రీశైలం, ద్వారకా తిరుమల, విజయవాడ దుర్గ గుడి, కాణిపాకం, శ్రీకాళహస్తి దేవస్థానాల్లో రెండేళ్ల కాలపరిమితితో ఆగస్టు 1 నుంచి పారిశుధ్య పనులు ప్రారంభిస్తుంది.

నెలల తరబడి జాప్యం

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో ఏ దేవస్థానానికి ఆ దేవస్థానంలో శానిటేషన్‌ టెండర్లు పిలిచి ఖరారు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని ప్రముఖ దేవస్థానాలకు ఒకే టెండర్‌ పిలవాలని గత ఏడాది ఆగస్టు 27న నిర్ణయం తీసుకున్నారు. అయినప్పటికీ, దీని అమలులో దాదాపు పది నెలలు ఆలస్యం చేశారు. గత ఏడాది నవంబర్‌ వరకూ అన్నవరం దేవస్థానంలో హైదరాబాద్‌కు చెందిన కేఎల్‌టీఎస్‌ సంస్ధ శానిటేషన్‌ విధులు నిర్వహించేది. ఆ సంస్థ కాంట్రాక్ట్‌ గత నవంబరుతో ముగిసింది. ఆ గడువుకు నెల రోజులు ముందే గత అక్టోబర్‌లో టెండర్‌ ప్రకటన విడుదల కావాల్సి ఉంది. అయితే, టెండర్లు పిలవడం ఆలస్యమవడంతో దేవస్థానం కోరిక మేరకు గత ఫిబ్రవరి నెలాఖరు వరకూ ఆ సంస్ధ సిబ్బంది విధులు నిర్వహించారు. మార్చి 1 నుంచి ఎటువంటి టెండరూ పిలవకుండా గుంటూరుకు చెందిన కనకదుర్గా శానిటరీ సర్వీసెస్‌కు తాత్కాలికంగా అప్పగించారు. శానిటరీ మెటీరియల్‌ మాత్రం దేవస్థానమే అందిస్తోంది.

రూ.80 లక్షలకు పెరిగే అవకాశం

దేవస్థానంలో గతంలో పారిశుధ్య పనులు నిర్వహించిన కేఎల్‌టీఎస్‌ సంస్ధకు నెలకు రూ.49 లక్షలకు టెండర్‌ ఖరారైంది. అనంతరం తాత్కాలికంగా వచ్చిన కనకదుర్గా ఏజెన్సీకి నెలకు రూ.59 లక్షలు జీతాలు, మరో రూ.12 లక్షలు మెటీరియల్‌కు కలిపి మొత్తం రూ.71 లక్షలు చెల్లిస్తున్నారు. తాజాగా అన్ని దేవస్థానాలకు కలిపి పిలిచిన సెంట్రలైజ్డ్‌ టెండర్‌లో పారిశుధ్య పనుల్లో అత్యాధునిక యంత్రాలు ఉపయోగించాలనే షరతు విధించారు. అలాగే, శానిటరీ సిబ్బందికి లేబర్‌ యాక్ట్‌ ప్రకారం జీతాలు చెల్లించాలని, వారాంతపు సెలవుల్లో సిబ్బంది రిలీవర్లుగా మరి కొంత మందిని నియమించాలని షరతు పెట్టారు. అలాగే, ఏసీలు, విద్యుత్‌ ఉపకరణాల నిర్వహణ కూడా కలిపారు. ఇవన్నీ కలిపితే అన్నవరం దేవస్థానంలో నెలకు రూ.80 లక్షల వరకూ ఆయా సంస్ధలు కోట్‌ చేసే పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement