పల్లెలపై పగబట్టినట్లు.. | - | Sakshi
Sakshi News home page

పల్లెలపై పగబట్టినట్లు..

Jun 14 2025 7:37 AM | Updated on Jun 14 2025 7:41 AM

సాక్షి ప్రతినిధి, కాకినాడ: పల్లెలపై కూటమి సర్కారు పగబట్టినట్టుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అత్యధిక పల్లెల్లో పాలనాధికారం వైఎస్సార్‌ సీపీ చేతుల్లో ఉంది. దీంతో, నిధులు విడుదల చేసి, పనులు జరిగితే ఆ క్రెడిట్‌ వైఎస్సార్‌ సీపీ సర్పంచ్‌లకే దక్కుతుందనే దురాలోచనతో గ్రామ పంచాయతీల ప్రగతికి అడుగడుగునా మోకాలడ్డుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా 15వ ఆర్థిక సంఘం రెండో విడత నిధులకు ప్రభుత్వం మోకాలడ్డుతోంది. దీంతో, పల్లెల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పన గగనమవుతోందని సర్పంచులు ఆవేదన చెందుతున్నారు.

మార్చిలోనే వచ్చినా..

జిల్లాలో మేజర్‌, మైనర్‌ గ్రామ పంచాయతీలన్నీ కలిపి 385 ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం గత మార్చి నెలలోనే 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ఖజానాకు జమ చేసింది. ఈ విధంగా జిల్లాలోని గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.28.39 కోట్లు సర్దుబాటు చేయాల్సి ఉంది. నెలలు గడుస్తున్నా కూటమి సర్కారు చిల్లిగవ్వ కూడా విదల్చకుండా కావాలనే ఈ నిధులను తొక్కి పెడుతోందని సర్పంచ్‌లు మండిపడుతున్నారు. ఆర్థిక సంఘం నిధులను టైడ్‌, అన్‌ టైడ్‌ విభాగాలుగా కేటాయిస్తారు. టైడ్‌ విభాగంలో పారిశుధ్యం, తాగునీటి అవసరాలకు,. అన్‌ టైడ్‌ విభాగంలో రోడ్లు, డ్రెయిన్లు, శ్మశాన వాటికల అభివృద్ధి, విద్యుత్‌, మోటారు మరమ్మతులు, చెత్త సేకరించే కార్మికుల వేతనాల వంటి వాటికి ఖర్చు చేస్తారు. మేజర్‌ పంచాయతీలకు ఇంటి పన్నులు, చేపల చెరువుల వేలం, వారపు సంతలు, కాలువ గట్లు, ఏటిగట్లపై కొబ్బరి చెట్ల ఫలసాయం ద్వారా వచ్చే ఆదాయం వంటివి ఉంటాయి. వీటితో కొన్ని పనులు చేసే అవకాశం వాటికి ఉంటుంది. వీటితో పోలిస్తే మైనర్‌ గ్రామ పంచాయతీలకు సాధారణ నిధులు చాలా తక్కువగా ఉంటాయి. ఈ పంచాయతీల్లో పారిశుధ్యం మెరుగుపరచి, తాగునీరు, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఆర్థిక సంఘం నిధులే దిక్కు. ప్రభుత్వం ఈ నిధులు ఇవ్వకపోవడంతో మైనర్‌ పంచాయతీలు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నాయి.

నిలిచిన పనులు

గ్రామ స్వరాజ్యమే కూటమి లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తరచుగా చెబుతూంటారు. కానీ, ఆర్థిక సంఘం నిధుల విడుదలకు వచ్చేసరికి మాత్రం రాజకీయం చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను గత ఎన్నికల్లో జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గ ప్రజలు గెలిపించారు. ఆవిధంగా ఆయన ఈ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పైగా పంచాయతీరాజ్‌ శాఖ ఆయన చేతుల్లోనే ఉంది. అయినప్పటికీ ఆయన గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయించాల్సిన అవసరాన్ని గుర్తించకపోతే ఎలాగని పలువురు ఆక్షేపిస్తున్నారు. గ్రామాల ప్రగతి కోసం కేంద్రం విడుదల చేసిన ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లిస్తున్నా పవన్‌కు పట్టకపోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. నిధులు రాకపోవడంతో జిల్లాలోని మేజర్‌, మైనర్‌ గ్రామ పంచాయతీల్లో మౌలిక సదుపాయాలు కల్పించలేని దుస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా పారిశుధ్యం, డ్రైన్లు, సిమెంటు రోడ్ల వంటి పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వర్షాకాలం రాకుండా పనులు పూర్తి చేద్దామన్నా కూటమి ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా ప్రజలను ఇబ్బందులు పెడుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. ఆర్థిక సంఘం నిధులు వస్తాయనే ఉద్దేశంతో స్థానిక సంస్థల ప్రతినిధులు అప్పులు చేసి మరీ కొన్ని అభివృద్ధి పనులు చేయించారు. వారు కూడా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పనులు ముందుకు సాగక పల్లెల్లో పాలన పడకేసి ప్రజలు కూడా నరకం కళ్ల చూస్తున్నారు.

ఇస్తారా.. ఇవ్వరా!

ఆర్థిక సంఘం నిధులు విడుదల కాక పల్లె పాలనకు ఎదురవుతున్న ఇబ్బందులను ‘సాక్షి’ క్షేత్ర స్థాయిలో సామర్లకోట మండలంలో పరిశీలించింది. ఈ మండలంలో పెదబ్రహ్మదేవం, మేడపాడు, వేట్లపాలెం, ఉండూరు, మాధవపట్నం మేజర్‌ పంచాయతీలున్నాయి. ఒక్కో పంచాయతీకి 15వ ఆర్థిక సంఘం నుంచి రెండో విడతగా రూ.18 లక్షల నుంచి రూ.20 లక్షల వరకూ రావాల్సి ఉంది. అలాగే, ఈ మండలంలో 13 మైనర్‌ గ్రామ పంచాయతీలున్నాయి. వీటికి ఒక్కో దానికి రూ.3 లక్షల నుంచి రూ.8 లక్షల వరకూ ఆర్థిక సంఘం నిధులు విడుదల కావాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులివ్వకపోవడంతో ఎక్కడి అభివృద్ధి పనులు అక్కడే నిలిచిపోయాయని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. నిధులు విడుదల కాకపోవడంతో ప్రజలు తమను ప్రశ్నిస్తున్నారని సర్పంచ్‌లు మధనపడుతున్నారు. కేంద్రం నిధులిచ్చినా రాష్ట్ర ప్రభుత్వ దయ కోసం నెలల తరబడి ఎదురుతెన్నులు తప్పడం లేదని సర్పంచ్‌లు, వార్డు సభ్యులు వాపోతున్నారు. ఈ నిధులిస్తే గ్రామాల్లోని దళితవాడల్లో రోడ్లు, డ్రైన్ల అభివృద్ధికి, తాగునీటి సదుపాయాల కల్పనకు, చెల్లింపులకు అవకాశం దక్కేదని చెబుతున్నారు. అసలు ఈ నిధులిస్తారా ఇవ్వరా అని పలువురు సర్పంచ్‌లు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

ఎదురు చూస్తున్నాం

పెద్దబ్రహ్మదేవం గ్రామంలో తాగునీటి సమస్య దారుణంగా ఉంది. వేసవిలో 15వ ఆర్థిక సంఘం నిధుల బకాయిలు రూ.18 లక్షల వరకూ ఉన్నాయి. ఆ నిధులు విడుదలైతే మంచినీటి సమస్య పరిష్కారానికి ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నాం. ఆ నిధులు ఎప్పుడొస్తాయో, అసలు వస్తాయో రావో అనే మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నాం. ఎస్సీ పేటలో రోడ్లు, డ్రైన్‌ సమస్యల శాశ్వత పరిష్కారానికి గంపెడాశతో ఎదురు చూస్తున్నాం.

– నీలపాల సత్యనారాయణ (బూరయ్య),

సర్పంచ్‌, పెదబ్రహ్మదేవం, సామర్లకోట మండలం

పారిశుధ్య పనులు భారం

ఆర్థిక సంఘం నిధులు రాకపోవడంతో మా గ్రామంలో పారిశుధ్య పను లు చాలా అధ్వానంగా మారాయి. కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేకపోతున్నాం. పంచాయతీల నిర్వహణ, తాగునీటి సరఫరా తదితర అత్యవసర పనుల నిర్వహణ తలకు మించిన భారంగా మారింది. గ్రామాల్లో పనులు చేయించకపోతే ప్రజల నుంచి ఛీ త్కారాలు ఎదురవుతున్నాయి. వర్షాకాలం మొదలైంది, పారిశుధ్య పనులు చేయకపోతే దోమలు వ్యాప్తి చెంది, అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంటుంది. శివా రు ప్రాంతాలకు తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడితే పైపులైన్‌ మరమ్మతులు చేపట్టాల్సి ఉంటుంది. 15వ ఆర్థిక సంఘం నిధులు రాక అత్యవసర పనులు చేయించేందుకు అప్పులు చేసి, ఖర్చు పెట్టాల్సి వస్తోంది.

– కమిడి మంగాదేవి, సర్పంచ్‌,

వేములవాడ, కరప మండలం

ఆర్థిక సంఘం నిధులు విడుదల కాక సామర్లకోట మండలం జి.మేడపాడు ఎస్సీ పేటలో అభివృద్ధికి నోచని రోడ్డు

నిధులు విదల్చని కూటమి సర్కారు

ముందుకు కదలని పనులు

డిప్యూటీ సీఎంగా జిల్లా నుంచే పవన్‌..

అయినా పైసల కోసం పెదవి విప్పని దుస్థితి

ఆర్థిక సంఘం నిధులకూ బ్రేకులు

గ్రామ పంచాయతీల్లో

సింహభాగం వైఎస్సార్‌ సీపీవే

అందుకే ప్రభుత్వం కక్ష

కట్టినట్టుందని విమర్శలు

పల్లెలపై పగబట్టినట్లు..1
1/3

పల్లెలపై పగబట్టినట్లు..

పల్లెలపై పగబట్టినట్లు..2
2/3

పల్లెలపై పగబట్టినట్లు..

పల్లెలపై పగబట్టినట్లు..3
3/3

పల్లెలపై పగబట్టినట్లు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement