
ఆలయ భూముల రక్షణ బాధ్యత ఈఓలదే..
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఆలయా లు, సత్రాలకు చెందిన భూముల రక్షణ బాధ్యత ఈఓలదేనని జిల్లా దేవదాయ శాఖ అధికారి కనపర్తి నాగేశ్వరరావు అన్నారు. దేవదాయ శాఖ మండల ఎండోమెంట్ అధికారులు, ఈఓలతో శుక్రవారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ఆలయాలు, సత్రాలకు ఉన్న భూములన్నీ రెవెన్యూ శాఖ 1బిలో నమోదయ్యాయో లేదో చూసుకోవాలన్నారు. ఆ భూమి వేరే వ్యక్తుల పేరిట ఉంటే తక్షణమే సంబంధింత ఆర్డీఓలకు వినతిపత్రం ఇచ్చి, 1బిలో దేవదాయ శాఖ భూమిగా నమోదు చేయించాలని ఆదేశించారు. ఈనాం భూములు కూడా వేరే వ్యక్తుల పేరిట ఉంటే వాటిని కూడా రెవెన్యూ శాఖ 1బిలో నమోదు చేయించాలన్నారు. 6సి దేవాలయాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. టెలి కాన్ఫరెన్స్లో దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ వడ్డి ఫణికుమార్ కూడా పాల్గొన్నారు.