కొమరగిరిలో భూచోళ్లు | - | Sakshi
Sakshi News home page

కొమరగిరిలో భూచోళ్లు

Apr 29 2025 12:18 AM | Updated on Apr 29 2025 12:18 AM

కొమరగ

కొమరగిరిలో భూచోళ్లు

సాక్షి ప్రతినిధి, కాకినాడ: అందిన కాడికి దోచుకు తినడమే కూటమి నేతల పనిగా మారినట్లు కనిపిస్తోంది. చేతుల్లో అధికారం ఉందని, తాము ఏమనుకుంటే అదే అవుతుందని, ఏం చేయాలనుకుంటే అదే చేస్తామని, తమను ఆపే దమ్ము ఎవరికి ఉందనే ధైర్యంతో చెలరేగిపోతున్నారు. ఇసుక, మట్టి, గ్రావెల్‌.. ఇలా ఒకటేమిటి అన్నింటా పెత్తనం తమదే అన్నట్లు బరితెగిస్తున్నారు. ఈ దోపిడీ యవ్వారం కాస్తా శృతి మించి, నిరుపేదల కోసం ప్రభుత్వం సేకరించిన భూముల్లో పాగా వేసే వరకూ వెళ్లింది. గ్రామ స్థాయి నుంచి డివిజన్‌ స్థాయి వరకు రెవెన్యూ యంత్రాంగం అండదండలు కూడా తోడవడంతో టీడీపీ, జనసేన నేతలు రూ.లక్షలు మింగేస్తున్నారు.

ఏం జరిగిందంటే..

కాకినాడ అర్బన్‌ పరిధిలో పేదలు, మధ్య తరగతి వర్గాల సొంతింటి కలను సాకారం చేయాలని గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వాధినేత, నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భావించారు. దీనికోసం యు.కొత్తపల్లి మండలం కొమరిగిరిలో రైతుల నుంచి 72 ఎకరాలు సేకరించారు. ఇందులో 30 ఎకరాల్లో లే అవుట్లు వేసి, పేదలకు పట్టాలు కూడా ఇచ్చేశారు. మిగిలిన 42 ఎకరాల్లో లే అవుట్‌ వేయాల్సి ఉంది. ఈ భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం అప్పట్లో పరిహారం కూడా చెల్లించేసింది. ఇక్కడ 350 మంది పేదలకు పట్టాలు కూడా అందచేసింది. భూమి పల్లంగా ఉండటంతో లే అవుట్‌ చేయడంలో కొంత జాప్యం జరిగింది. ఇంతలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో లే అవుట్‌, భూమి అభివృద్ధి పనులు ముందుకు సాగలేదు. నాటి ఎన్నికల్లో టీడీపీ, జనసేన నేతల కల్లబొల్లి హామీలను నమ్మి ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని గద్దెనెక్కించారు. అదే ఇప్పుడు పేదలకు శాపంగా.. ఆ పార్టీల నేతలకు కల్పతరువుగా మారింది.

42 ఎకరాలపై కూటమి నేతల కన్ను

కొమరగిరిలో లే అవుట్‌ చేయని, రెండు పంటలు పండే సారవంతమైన 42 ఎకరాల భూములపై కొన్నాళ్ల కిందట కూటమి నేతల కన్ను పడింది. రైతులకు పూర్తిగా పరిహారం చెల్లించడంతో ఆ భూములపై ప్రభుత్వానికే సర్వహక్కులూ ఉంటాయి. కానీ, ప్రభుత్వం తమదేనన్న ధీమా, అధికారులు తమ మాట కాదరనే ధైర్యంతో కూటమి నేతలు ఆ భూములను యథేచ్ఛగా తమ చేతుల్లోకి తీసేసుకున్నారు. గత ప్రభుత్వం ఎలాగూ పరిహారం ఇచ్చేసిందనే మిషతో అప్పటి వరకూ ఆ భూములకు యజమానులుగా ఉన్న రైతులను నయానా భయానా బెదిరించి తరిమేశారు. ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సిన ఆ భూములపై ఆధిపత్యం కోసం టీడీపీ, జనసేన నేతలు వర్గాలుగా విడిపోయారు. ఈ విషయంలో టీడీపీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే రంగంలోకి దిగి, ఇరు పార్టీల నేతలకు మీకు సగం.. మాకు సగం అనే పద్ధతిల రాజీ కుదిర్చారు. ప్రభుత్వ ఆధీనంలోని భూములను తాతముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చిన జిరాయితీ భూముల మాదిరిగా బినామీలకు లీజులకు ఇచ్చేశారు. రెవెన్యూ అధికారులను గుప్పెట్లో పెట్టుకుని మీకింత.. మాకింత అంటూ రూ.లక్షలు కొల్లగొడుతున్నారు. ఖరీఫ్‌ రబీ సీజన్లు రెండూ కలిపి ఎకరాకు రూ.40 వేలు ఇవ్వాలనేది నేతలు, బినామీ రైతులు చీకటి ఒప్పందం చేసుకున్నారు. ఇందులో నాలుగో వంతు రెవెన్యూ వర్గాలకు ముట్టజెప్పేందుకు అంగీకారం కుదిరిందని కొమరగిరి కోడై కూస్తోంది. అంటే 42 ఎకరాలకు, రెండు సీజన్లకు కలిపి రూ.16.80 లక్షల మేర కూటమి నేతల జేబుల్లోకి వెళ్లిపోతోంది. ఇదంతా కళ్లెదుటే జరుగుతున్నా అధికార యంత్రాంగం గుడ్లప్పగించి చూస్తూండటంపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

చేతులు దులుపుకొంటున్న ‘రెవెన్యూ’

ఈ భూముల విషయమై అక్కడి రెవెన్యూ అధికారులను అడిగితే కాకినాడ అర్బన్‌ పరిధిలోని లబ్ధిదారుల కోసం కేటాయించిన భూములని, తమకు ఎటువంటి ప్రమేయమూ లేదని తప్పించుకుంటున్నారు. కాకినాడ రెవెన్యూ అధికారులైతే ఆ భూముల్లో ఎవ్వరూ సాగు చేయరాదని, ఒకవేళ చేస్తే కౌలు చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించామని చెబుతూ చేతులు దులుపుకొంటున్నారు. ఈ భూబాగోతం నిగ్గు తేల్చాలని ప్రజాసంఘాలు ఆందోళన బాట పట్టాయి. ప్రభుత్వం పరిహారం చెల్లించిన ఈ భూములను తిరిగి స్వాధీనం చేసుకుని, అర్హులైన లబ్థిదారులకు ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేయాలనే డిమాండుతో సీపీఐ, అనుబంధ వ్యవసాయ కూలీ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి.

పట్టా భూముల్లో కూటమి నేతల తిష్ట

బినామీ రైతులతో గ‘లీజు’ వ్యవహారం

మీకు సగం.. మాకు సగం అంటూ కొల్లగొట్టు యవ్వారం

పేదలకు ఇవ్వాలి

కొమరగిరి భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవాలి. ప్రభుత్వ భూమిలో అడ్డగోలుగా సాగు చేస్తున్న వారిని ఉపేక్షించడం అన్యాయం. రెవెన్యూ అధికారులు చొరవ తీసు కుని పేదలకు ఇళ్ల స్థలాల కోసం ఈ భూములు కేటాయించాలి. అర్హులైన వారికి 3 సెంట్ల ఇంటి స్థలం ఇస్తామన్న కూటమి ప్రభుత్వ హామీని వెంటనే కొమరగిరి భూముల్లో అమలు చేసి, చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. అధికారులు చొరవ తీసుకోకుంటే బినామీ రైతులతో సాగు చేస్తున్న వారికి మద్దతు ఇస్తున్నట్లుగానే పరిగణించాల్సి ఉంటుంది. – తాటిపాక మధు, సీపీఐ జిల్లా కార్యదర్శి, కాకినాడ

స్వాధీనం చేసుకునే వరకూ పోరాటం

కొమరగిరి భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకునే వరకూ పోరాటం ఆపేది లేదు. ఈ భూముల్లో ఇల్లు కట్టుకునేందుకు అర్హులైన 1,400 మంది నిరుపేదల జాబితా రూపొందించి, రెవెన్యూ అధికారులకు అందజేశాం. ఆ జాబితాను పరిశీలించి అర్హులైన వారికి నిబంధనల మేరకు 3 సెంట్ల స్థలం పంపిణీ చేయాలి.

– నక్కా శ్రీనివాసరావు,

ఉపాధ్యక్షుడు, వ్యవసాయ కార్మిక సంఘం, కాకినాడ జిల్లా

కొమరగిరిలో భూచోళ్లు1
1/2

కొమరగిరిలో భూచోళ్లు

కొమరగిరిలో భూచోళ్లు2
2/2

కొమరగిరిలో భూచోళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement