
అమ్మాయిలే మిన్నగా..
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో అమ్మాయిలు అదరగొట్టారు. గత నెల 17 నుంచి 31వ తేదీ వరకూ నిర్వహించిన టెన్త్ పరీక్షలకు 27,368 మంది విద్యార్థులు హాజరు కాగా, 22,508 మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది ఉత్తీర్ణత శాతం 82.02 శాతం రాగా ఈ ఏడాది 82.24 శాతంతో కాస్త మెరుగుపడి రాష్ట స్థాయిలో జిల్లాకు 15వ స్థానం దక్కింది. ప్రభుత్వ పాఠశాల అనగానే అత్తెసరు మార్కులతో ఉత్తీర్ణత అనే పదానికి ఫుల్ స్టాప్ పడింది. చాలీచాలని గదులు, శిథిలావస్థకు చేరిన భవనాలు, కనీస వసతులు వంటి సమస్యలకు చెక్ పెట్టి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ప్రభుత్వ పాఠశాలలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని నాడు–నేడు ద్వారా రూపు రేఖులు మార్చారు. బోధన విషయంలో వినూత్న మార్పులు తీసుకొచ్చారు. దాని ఫలితంగా సగర్వంగా సర్కార్ బడులు తలెత్తుకుంటున్నాయి. పదో తరగతి పరీక్షల్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధిస్తున్నారంటే అది గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చదువులపై తీసుకున్న శ్రద్ధ వల్లనే అని అర్థమవుతుంది.
బాలికలదే పైచేయి
పది ఫలితాల్లో బాలికలే పైచేయిగా నిలిచారు. జిల్లాలో 27,368 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో బాలురు 13,708, బాలికలు 13,660 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల్లో 10,850 మంది బాలురు ఉత్తీర్ణత సాధించగా, 11.658 మంది బాలికలు ఉత్తీర్ణత సాధించి పై చేయి సాధించారు. జిల్లా వ్యాప్తంగా 82.24 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, బాలురు 79.15 శాతం, బాలికలు 85.3 శాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాలకు సంబంధించి 27,368 మంది పరీక్షలకు హాజరు కాగా 22,508 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత సాధించిన వారిలో 17.098 మంది ప్రథమ శ్రేణి, 3,568 మంది ద్వితీయ శ్రేణి, 1,842 మంది తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. కాకినాడకు చెందిన యాళ్ల నేహాంజని 600కు 600 మార్కులు సాధించి విశేష ప్రతిభ చూపింది. ప్రాథమిక విద్య నుంచి ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధిస్తూ ప్రణాళిక బద్ధంగా చదువుతూ మంచి మార్కులు సాధించి కాకినాడ చరిత్రలో నూటికి నూరుశాతం మార్కులతో ఘనత చాటింది.
సమష్టి విజయం
పది ఫలితాల్లో జిల్లా మెరుగైన ఫలితాలు సాధించడానికి ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారుల సమష్టి కృషి కారణమైందని జిల్లా విద్యాశాఖాధికారి పిల్లి రమేష్ అన్నారు. ఈ విజయంలో భాగస్వాములైన హెచ్ఎంలు, ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులకు ఆయన అభినందనలు తెలియజేశారు.
పేదింటి తోటలో పూసిన పుష్పాంజలి
పిఠాపురం: రైతింట తోటలో పూసింది పుష్పాంజలి. సౌకర్యాలు కల్పిస్తే ప్రభుత్వ పాఠశాలల్లోను మంచి అద్భుతాలు సృష్టించే ఫలితాలు సాధించవచ్చని నిరూపించింది. గొల్లప్రోలుకు చెందిన రైతు తోట రాంబాబు భార్య సుజాతలకు మూడవ కుమార్తె అయిన తోట పుష్పాంజలి గొల్లప్రోలు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో చదువుకుంటోంది. పదవ తరగతి ఫలితాల్లో 600కు 594 మార్కులు సాధించి నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధిక మార్కులు సాధించి విద్యా కుసుమాంజలిగా ప్రశంసలందుకుంది. ఎల్ఎల్బీ చదివి లాయర్గా స్థిరపడాలని అనుకుంటున్నట్లు తెలిపింది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సూర్యప్రకాశరెడ్డి ఇతర ఉపాధ్యాయులు అభినందించారు.
కూలీ ఇంట్లో మెరిసిన కనకవల్లి
నిరుపేద కుటుంబానికి చెందిన ఆకేటి వెంకటరమణ, వెంకటలక్ష్మి దంపతుల కుమార్తె ఆకేటి కనకవల్లి పదవ తరగతి ఫలితాల్లో 600కు 590 మార్కులు సాధించింది. గొల్లప్రోలు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో చదువుకుంటోంది. నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధిక మార్కులు సాధించి ప్రశంసలందుకుంటోంది. ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి తన తండ్రికి చేదోడుగా ఉండాలనేదే తన ధ్యేయమని ఆమె చెబుతోంది.
టెన్త్ ఫలితాల్లో
రాష్ట్ర స్థాయిలో జిల్లాకు 15వ స్థానం
82.24 శాతం ఉత్తీర్ణత