
స్థానిక స్వపరిపాలనకే పంచాయతీరాజ్
ఆలమూరు: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజల అభ్యున్నతి, క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారం కోసం జాతీయ పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటైంది. పేదరిక నిర్మూలన ధ్యేయంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలను అందించే లక్ష్యంగా 1992లో అప్పటి కేంద్ర ప్రభుత్వం 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. భారత దేశంలో ఈచట్టం 1993 ఏప్రిల్ 24 నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో సమితి వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి తొలి స్థానిక స్వపరిపాలన వ్యవస్థ అయిన గ్రామ పంచాయతీలకు తోడుగా మూడంచెల విధానంలో మండల ప్రజా పరిషత్, జిల్లా పరిషత్లు ఏర్పడ్డాయి. అలాగే 2009 లో మరోసారి జరిపిన 110వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ పితామహుడు బలవంత్రాజ్ మెహతా కమిటీ సిఫారసుల మేరకు ఆధునిక పంచాయతీరాజ్ వ్యవస్థకు తిరిగి రూపకల్పన జరిగింది. రాజ్యాంగ సవరణ ద్వారా రూపొందించిన పంచాయతీరాజ్ చట్ట నియమావళి ఆధారంగా ప్రజా ప్రతినిధులు, అధికారులు విధులు నిర్వహిస్తూ గ్రామీణ వ్యవస్థ అభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్నారు.
గ్రామాల అభివృద్ధికి మూడంచెల పద్ధతి
జాతీయ పంచాయతీరాజ్ వ్యవస్థ అమలు చేస్తున్న మూడంచెల పద్ధతి ప్రకారం విధుల నిర్వహణలో స్పష్టమైన విధానం ఉంటుంది. జిల్లా స్థాయిలో జెడ్పీటీసీలు, మండల స్థాయిలో ఎంపీటీసీలు, గ్రామ స్థాయిలో సర్పంచ్లు అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందే నిధులను మండల ప్రజా పరిషత్కు జిల్లా పరిషత్ కేటాయిస్తుంది, అలాగే మండల స్థాయిలో నిర్ణయించే బడ్జెట్ను జిల్లా పరిషత్ ఆమోదించి ఆ మేరకు నిధులను కేటాయిస్తుంది. మండల ప్రజా పరిషత్కు ఏవిధమైన పన్నులు విధించే అవకాశం లేనందున జిల్లా పరిషత్, రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను మాత్రమే గ్రామ పంచాయతీలకు కేటాయిస్తుంది. ఇక గ్రామ పంచాయతీలైతే స్వయంగా నిధులను సమకూర్చుకోవడంతో పాటు మండల, జిల్లా పరిషత్ కేటాయించే నిధులతో గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటుంది. గ్రామీణ ప్రజల పౌర సౌకర్యాలు కల్పించడం, ప్రజా హక్కులకు భంగం వాటిల్లకుండా పరిరక్షించడం పంచాయతీరాజ్ ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుంది.
వ్యవస్థల విధుల నిర్వహణపై స్పష్టత
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్ద పీట
నేడు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం

స్థానిక స్వపరిపాలనకే పంచాయతీరాజ్